
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఒలింపిక్ రజత పతక విజేత సింధు 21–8, 21–15తో లిండా జెట్చిరి (బల్గేరియా)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో నాలుగో సీడ్ ప్రణయ్ 21–16, 21–19తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై, పారుపల్లి కశ్యప్ 21–15, 21–17తో జేసన్ ఆంథోనీ (కెనడా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించారు. సమీర్ వర్మ 18–21, 16–21తో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్లో జక్కా వైష్ణవి రెడ్డి పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది.
వైష్ణవి 13–21, 17–21తో సయాకా సాటో (జపాన్) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 21–18, 15–21, 21–17తో చెన్ హంగ్ లింగ్–వాంగ్ చీ లిన్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచింది. అర్జున్–రామచంద్రన్ శ్లోక్ జోడీ 18–21, 21–13, 16–21తో వహ్యూ నాయక ఆర్య పంగకర్యనిరా–యూసుఫ్ సంతోసో (ఇండోనేసియా) జంట చేతిలో; అనిల్ కుమార్ రాజు–వెంకట్ గౌరవ్ ప్రసాద్ ద్వయం 21–14, 12–21, 14–21తో చుంగ్ యొన్నీ–టామ్ చున్ హై (హాంకాంగ్) జోడీ చేతిలో; కోన తరుణ్–సౌరభ్ శర్మ జంట 6–21, 6–21తో లియో మిన్ చున్–సు చింగ్ హెంగ్ (తైవాన్) ద్వయం చేతిలో ఓటమి పాలై తొలి రౌండ్లోనే వెనుదిరిగాయి. మహిళల డబుల్స్లో మేఘన–పూర్విషా రామ్ జంట 21–23, 8–21తో చెన్ సియో హుఆన్–హు లింగ్ ఫాంగ్ (తైవాన్) జోడీ చేతిలో; మిక్స్డ్ డబుల్స్లో సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్ ద్వయం 19–21, 15–21తో మాక్ హీ చున్–యెంగ్ గా తింగ్ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలయ్యాయి.