ఆ కమిటీలతో రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు: నాగి రెడ్డి
శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టు ప్రకారం తుపాను బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలను వైఎస్సార్సీపీ నాయకులతో కలసి నాగిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ..క్షేత్రస్థాయిలో వాస్తవ రిపోర్టులను తయారుచేయాలని కోరారు. జన్మభూమి కమిటీల ప్రమేయంతో రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తుపానుకు ముందే ఒడిశా ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. తుపాను ప్రభావిత ప్రాంత రైతులకు రుణామాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా వడ్డీలేని వ్యవసాయ రుణాలు పదేళ్ల కాలం పాటు ఇవ్వాలని కోరారు. తుపాను ప్రభావిత ప్రాంత విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని వేడుకున్నారు. తుపాను రాజకీయాంశం కాదని, మానవత్వంతో ఆదుకోవాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.