చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలువలు తెలుసా?

YS Vijayamma Speech At Regidi Public Meeting - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాతుంటే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టలేదా అని వైఎస్సార్‌సీసీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ప్రశ్నించారు. అసెంబ్లీలో జగన్‌ మాట్లాడుతుంటే మైక్‌ కట్‌ చేసి అడ్డుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబుకు అసలు ప్రజాస్వామ్య విలువలు తెలుసా నిలదీశారు. వైఎస్‌ జగన్‌ మీద చంద్రబాబు అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రేగిడిలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగించారు. విజయమ్మ మాట్లాడుతూ..‘దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత వైఎస్సార్‌ది. వైఎస్సార్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబు పాలనలో అందరికీ కష్టాలే. వైఎస్సార్‌ ఆశయాల కోసమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టింది. ప్రజల సంక్షేమం కోసమే వైఎస్సార్‌సీపీ పనిచేస్తుంది. 

2014 ఎన్నికల సమయంలో 600కు పైగా వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదు. ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. 2.30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయలేదు. సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌ చెబుతుంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు. టీడీపీ పాలనలో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలు. మళ్లీ అవే అబద్ధాలతో మీ ముందకొస్తున్న చంద్రబాబును నమ్మకండి. వైఎస్‌ జగన్‌ నవరత్నాలతో అందరికీ మేలు జరుగుతుంది. రాజన్న రాజ్యం కోసం ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇవ్వండి

చంద్రబాబు ఏం చేశాడంటే..
తోటపల్లి ప్రాజెక్టు కుడి కాలువ పనులు వైఎస్సార్‌ పూర్తి చేశారు. రాజాం ఆర్టీసీ బస్టాండ్‌ విస్తరణ వైఎస్సార్‌ సీఎంగా ఉన్నపుడే జరిగింది వైఎస్సార్‌ కాలంలోనే శ్రీకాకుళం నుంచి రాజాంకు రోడ్లు వేశారు. మట్టివలస కాలువ ఆధునీకరణ జరిగింది. వైఎస్సార్‌ హయంలో ఈ నియోజకవర్గంలోనే 60 వేల ఇళ్లు ఇచ్చారు. కానీ చంద్రబాబు చెప్పిన ఏ ఒక్క హామీ అయిన నెరవేరిందా? రాజం స్మార్ట్‌ సిటీ అయిందా?. తోటపల్లి ఆధునీకరణ పనులు జరిగాయా?. రోడ్ల విస్తరణ జరిగిందా?. కానీ చంద్రబాబు ఏం చేశాడంటే.. 3600 మంది పింఛన్లు తీసేశారు. 18 స్కూళ్లు మూసేళారు. 30 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు తీసేశారు. రాజాంలోని 17 పరిశ్రమలను మూసేని 20వేల మందిని రోడ్డున పడేలా చేశారు.బలసల రేవు వంతెన కోసం 700 రోజులు దీక్షలు చేస్తే చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం మంత్రినైనా అక్కడికి పంపించారా?. కిడ్నీ వ్యాధులతో అంబకంది గ్రామంలో 24 మంది చనిపోతే చంద్రబాబు పట్టించుకోలేదు. కనీసం రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేదు. కానీ నాగావళిలో యథేచ్ఛగా ఇసుక దోపిడి చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే.. తోటపల్లి కాలువ ఆధునీకరణ చేపడతాం. బలసల రేవు వంతెన నిర్మిస్తాం. రాజాంలో రోడ్ల విస్తరణ చేపడతాం. వైఎస్‌ జగన్‌ మాట ఇస్తే తప్పే రకం కాదు. ఓదార్పు యాత్ర కోసం  మాట ఇచ్చినందుకే.. జగన్‌ జీవితమే మారిపోయింది. చంద్రబాబు అమరావతిలో శాశ్వత నిర్మాణాల కోసం ఒక్క ఇటుకైనా వేశారా?. రైతులకు మూడు పంటలు పండే భూములు తీసుకుని తన బినామీలకు అప్పజెప్పారు. హైదరాబాద్‌ను తానే కట్టానని చెప్పుతున్న చంద్రబాబు.. ఈ నాలుగేళ్లలో దుర్గ గుడి ఫ్లైఓవర్‌ కూడా ఎందుకు కట్టలేకపోయారు?.

సంక్షేమ పథకాల డోర్‌ డెలివరీ..
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావాలి. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. గిరిజనులు భూములకు పట్టాలు ఇస్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తారు. అంతేకాకుండా గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తారు. పెట్టుబడి సాయంగా రూ. 12, 500 అందిస్తారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారు. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. గ్రామా సచివాలయాల ద్వారా ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే అయిపోతుంది. సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేస్తాం. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 7లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగులును, ఎంపీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖర్‌ను అత్యధిక మోజారిటీతో గెలిపించండ’ని కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top