బాబు సీనియారిటీ ఏమైంది: పార్థసారధి | where is babu seni seniority | Sakshi
Sakshi News home page

బాబు సీనియారిటీ ఏమైంది: పార్థసారధి

Feb 2 2018 5:12 PM | Updated on Aug 29 2018 3:33 PM

where is babu seni seniority - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి కొలుసు పార్థసారథి

విజయవాడ: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం చంద్ర బాబు నాయుడు ఏమీ సాధించలేకపోయారని, ఆయన సీనియారిటీ ఏంటో రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు బాగా అర్ధమైందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి కొలుసు పార్థసారథి విమర్శించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పదేపదే విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని చంద్రబాబు చెబుతున్నారని..కానీ అటు వరంగల్, హైదరాబాద్‌కు వెళ్లినపుడు మాత్రం తన వల్లే తెలంగాణా వచ్చిందని చంద్రబాబు చెప్పలేదా అని ప్రశ్నించారు.

కేంద్రంతో తమ సంబంధాలు బాగున్నాయని ఇప్పటి వరకు చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారని..అంటే ఈ ఏడాదే కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందా? అని సూటిగా అడిగారు. నాలుగేళ్లుగా ఎన్డీఎలో భాగస్వామిగా ఉండి చంద్రబాబు ఏం సాధించారని అన్నారు. బడ్జెట్ పై చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోదని నాలుగేళ్లుగా వైఎస్ఆర్సీపీ పోరాటాలు చేస్తోందని, ప్రతిసారీ పోలీసులతో కేసులు పెట్టారని గుర్తు చేశారు. మా పోరాటంను చూపి, కేంద్రంపై ఎందుకు చంద్రబాబు సర్కారు వత్తిడి చేయలేదని ప్రశ్నించారు.

24 సార్లు సీఎం ఢిల్లీ వెళ్లారని టీడీపీ నేతలు చెబుతున్నారని, తనపై వున్న కేసుల కోసమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని ఇప్పుడు అర్ధమవుతోందని విమర్శించారు. ప్రతిపక్షంగా తాము చెప్పింది ఏనాడూ చంద్రబాబు పట్టించుకోలేదని, రాష్ట్రం అన్యాయమై పోతోందని తాము అనేక సార్లు ఆందోళన నిర్వహించామని చెప్పారు. విభజన హామీలపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరంను తామే కడతామని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని అడిగారు. ఈ నాలుగేళ్లలో అరకొర నిధులు ఇస్తున్నా..కేంద్రం ను చంద్రబాబు సర్కార్ ఎందుకు అడగలేదన్నారు. రైల్వే జోన్‌ సంగతేంటని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement