
సాక్షి, రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబు మాటలకు, లెక్కలకు పొంతన లేదని మాజీ ఎంజీ ఉండవల్లి అరుణ్కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి కాకిలెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. జీడీపీ పెంచామంటూనే, రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారని తెలిపారు.
రాష్ట్రానికి న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేంద్రంపై కానప్పుడు ఎవరిపై కోర్టుకు వెళతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పక్కన కూర్చుని మరీ ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకని నీతిఆయోగ్ వైస్చైర్మన్ అనడం దారుణమన్నారు.
హైదరాబాద్ నుంచి ఐటీ కంపెనీలు కోస్తాకు ఎందుకు వస్తాయని అన్నారు. కార్పొరేట్ కంపెనీలన్నీ బెంగళూరు, హైదరాబాద్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ ప్రధాన కార్యాలయం కూడా హైదరాబాద్లోనే ఉందని, తెలంగాణకు పన్ను చెల్లిస్తోందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు మాత్రమే తన కార్యాలయాన్ని విజయవాడకు మార్చుకున్నారని, హైదరాబాద్ను వదిలిపెట్టి ఎవరూ రావడం లేదన్నారు. సినిమావాళ్లు అక్కడే ఉన్నారని పేర్కొన్నారు.