పౌరసత్వ బిల్లు: విప్‌ జారీచేసిన టీఆర్‌ఎస్‌ | TRS Says Vote Against To Citizenship Bill In Parliament Issues Whip | Sakshi
Sakshi News home page

పౌరసత్వ బిల్లు: విప్‌ జారీచేసిన టీఆర్‌ఎస్‌

Dec 9 2019 11:57 AM | Updated on Dec 9 2019 12:31 PM

TRS Says Vote Against To Citizenship Bill In Parliament Issues Whip - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ (సవరణ) బిల్లును నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరు లకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును హోం మంత్రి అమిత్‌ షా దిగువ సభలో ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ, అనంతరం ఓటింగ్‌ జరగనుందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. అయితే  ఈ కీలక బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఎంపీలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పార్లమెంట్‌ సభ్యులకు విప్‌ జారీచేసింది.

బిల్లుపై చర్చ సందర్భంగా ఈ రోజు, రేపు (సోమ, మంగళవారం) పార్లమెంట్‌కు తప్పకుండా హాజరుకావాలని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపీలకు సూచించారు. కాగా వివాదస్పద పౌరసత్వ బిల్లును కాంగ్రెస్‌, వామపక్షలు, టీఆర్‌ఎస్‌తో పాటు ఎన్డీయేతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే లోక్‌సభలో అధికార బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఓటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండకపోచ్చని తెలుస్తోంది. ఎగువ సభలో మిత్రపక్షాల మద్దతును బీజేపీ కూడగొట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులకు విప్‌ జారీ చేసింది. సోమవారం నుంచి మూడు రోజులపాటు సభకు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement