మన్మోహన్‌ కన్నా మోదీనే మేలు : షీలా దీక్షిత్‌ | Sheila Dikshit Said Narendra Modi Is Better Than Manmohan Singh On Terror | Sakshi
Sakshi News home page

రాజకీయ దుమారం రేపుతున్న ఢిల్లీ మాజీ సీఎం వ్యాఖ్యలు

Mar 15 2019 9:38 AM | Updated on Mar 15 2019 12:40 PM

Sheila Dikshit Said Narendra Modi Is Better Than Manmohan Singh On Terror - Sakshi

న్యూఢిల్లీ : ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూర్చేలా మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నా మోదీనే మేలంటూ సంచలన వ్యాఖ్యలు చేసి​ చిక్కుల్లో పడ్డారు షీలా దీక్షిత్‌. మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఓ ఆంగ్ల మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో షీలా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2008లో 26/11 దాడులు జరిగినప్పుడు ఉగ్రవాద నిర్మూలన కోసం యూపీఏ సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీనిపై షీలా స్పందిస్తూ.. ‘అవును ఈ విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని అణిచే విషయంలో మన్మోహన్‌ కాన్న నరేంద్ర మోదీనే బెటర్‌. ఐతే రాజకీయ లబ్ధి కోసమే మోదీ పాకిస్తాన్‌ పట్ల దూకుడుగా వ్యహరిస్తున్నార’ని తెలిపారు. బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా కేంద్రంపై వైమానికదాడులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు షీలా దీక్షిత్. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు బీజేపీ నేతలు. పాకిస్తాన్‌కు ధీటుగా జవాబిచ్చే ధైర్యం ఒక్క మోదీకే ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం షీలా వ్యాఖ్యలను జీర్ణించులేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆత్మరక్షణలో పడ్డారు షీలా దీక్షిత్. మీడియా సంస్థలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని.. తాను మాట్లాడిన సందర్భం వేరే అని స్పష్టం చేశారు షీలా దీక్షిత్‌.

Advertisement
 
Advertisement
Advertisement