ది రియల్‌ కింగ్‌ మేకర్‌!

Sharad Pawar is a Key Figure in the Politics of Maharashtra - Sakshi

సాక్షి, ముంబై: అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో ఎదురైన చేదు అనుభవాలను దాటుకొని 79 ఏళ్ల శరద్‌ పవార్‌ నిజమైన కింగ్‌ మేకర్‌గా నిలిచారు. సమకాలీన రాజకీయాల్లో అపర చాణుక్యులుగా పరిగణింపబడుతున్న మోదీ షా ద్వయానికి దీటుగా వ్యూహాలు రచించి సీట్ల పరంగానే కాదు, ప్రభుత్వ ఏర్పాటులో కూడా తనది కీలక పాత్ర అని పవార్‌ నిరూపించుకున్నారు. విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన కాంగ్రెస్‌, శివసేనల మధ్య సయోధ్య కుదర్చి, ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో పరిణితి చెందిన రాజకీయం ప్రస్పుటమవుతుంది.

కుటుంబ రాజకీయాలను దాటుకొని
కుటుంబం, పార్టీలోనూ కీలక వ్యక్తి అయిన అజిత్‌ పవార్‌ (కేసుల భయం కావచ్చు లేదా పదవీ వ్యామోహం కావచ్చు) బీజేపీకి లొంగిపోయినా తిరిగి సొంత గూటికి రప్పించడంలో తన వ్యూహం ఫలించింది. మరోవైపు తన వారసురాలిగా సొంత కూతురు సుప్రియా సూలేను ప్రకటించకపోయినా పార్టీలో అత్యధికులు అలాగే భావించడం, అలా అయితే తన పరిస్థితి ఏంటని పార్టీలో మరో కీలక వ్యక్తి అయిన అజిత్‌పవార్‌ బీజేపీకి మద్దతివ్వడం లాంటి పరిణామాలను చూస్తే పార్టీలో అంతర్గత సంక్షోభం వచ్చే పరిస్థితులు కనిపించాయి. ఈ పరిస్థితులలో ఆలోచించి చూస్తే అజిత్‌ పవార్‌ను పార్టీనుంచి బహిష్కరిస్తాడనే అనుకున్నారు అంతా. కానీ తెలివిగా పైపైన అజిత్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి, తిరిగి సొంత గూటికి చేరుకునేలా చేశారు. దానికంటే ముందు అతని వెనుక ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడి తన వైపుకు తిప్పుకున్నారు. అనంతరం తన కుటుంబసభ్యులను రాయబారానికి పంపి అజిత్‌ను ఒప్పించగలిగారు. దీని ఫలితంగా 80 గంటల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్‌ నిర్వహించిన మొదటి క్యాబినెట్‌ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా అజిత్‌పవార్‌ హాజరు కాలేదు.


ఎన్నికల ప్రచారంలో వర్షంలో తడుస్తూ ప్రసంగిస్తున్న శరద్‌పవార్‌

ఇంతకు ముందు 2014 అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో శరద్‌ పవార్‌ పనైపోయిందని అత్యధికులు భావించారు. ఈ నేపథ్యంలో గత నెల జరిగిన ఎన్నికల ప్రచారంలోముఖ్యంగా తనకు పట్టు ఉందని భావిస్తున్న పశ్చిమ మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ తీవ్రంగా కష్టపడ్డారు. ఇందులో భాగంగా సతారా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భారీ వర్షం పడుతున్నా బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ వీడియో జాతీయ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వైరలయింది. తద్వారా ప్రజలతో ఒక రకమైన భావోద్వేగ సంబంధాన్ని నెలకొల్పుకున్నారు. ఆ సభలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను నిలబెట్టడంలో తాను విఫలమయ్యానని తన తప్పును నిజాయితీగా ఒప్పుకున్నారు. దీని వల్ల శరద్‌ పవార్‌ అంకిత భావం, చిత్తశుద్ధి ఎన్నికల్లో ప్రభావవంతంగా పనిచేసింది. ఫలితంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్సీపీకి 15 సీట్లు పెరిగాయి. గెలిచిన ఎమ్మెల్యేలంతా అత్యధిక మెజార్టీతో గెలుపొం    

తదుపరి కర్తవ్యం?
పైన పేర్కొన్న వాటితో శరద్‌పవార్‌ మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్‌పవార్‌ పాత్ర కీలకంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఇంతటితో అయిపోలేదు. మూడు పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పాటైనా పూర్తి కాలం నిలబడుతుందని చెప్పలేం. విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన శివసేన, కాంగ్రెస్‌లు ప్రస్తుతం అధికారం దక్కనుందనే భావనతో అంతా బాగున్నట్టు ప్రవర్తించినా ఇదే తీరు ఐదేళ్లు కొనసాగించేలా చూడడం అత్యవసరం. ప్రభుత్వ నిర్వహణలో బేదాభ్రిపాయాలు వచ్చినా వాటి ప్రభావం కూటమిపై పడకుండా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు రాకుండా శరద్‌పవార్‌ చూసుకోవాలి.  ఇలా కాకుండా పరిణామాలు మరోలా ఉంటే అదనుకోసం బీజేపీ కాచుకొని ఉంటుందన్న సంగతి మరచిపోరాదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top