చంద్రబాబు ఎప్పటికీ మారరు
ప్రభుత్వంపై నిందలతో కాలక్షేపం ఆయన నైజం
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయి ఇవ్వాళ్టికి 56 రోజులైందని, 60 వీడియో కాన్ఫరెన్స్లు, 60 టెలీకాన్ఫరెన్స్ల్లో ప్రగల్భాలు పలుకుతూ, ప్రభుత్వంపై నిందలు మోపడం ఆయన నైజమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. వలస కార్మికులకు ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోందన్నారు. కష్ట కాలంలోనూ రైతులకు పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ పాలన తీరుకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇలాంటి సమయంలోనూ పక్క రాష్ట్రంలో కూర్చుని నిందలు వేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఆయన ఎప్పటికీ మారరని, రాష్ట్ర ప్రయోజనాలకు, పేదల ప్రయోజనాలకు గండికొడుతున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రభుత్వ కృషిని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
► వలస కూలీలను రైలు మార్గం ద్వారా స్వస్థలాలకు పంపుతున్నాం. నిర్దిష్ట దూరంలో భోజనం, తాగునీరు వలస కూలీలకు అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నడుచుకుంటూ వెళ్తున్న వారిని గుర్తించి ఆయా రాష్ట్రాలతో మాట్లాడి కూలీలను స్వస్థలాలకు పంపించాలని సీఎం అధికారులకు సూచించారు. అంతే కాకుండా వారికి ఒక్కొక్కరికి రూ.500 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
► కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేలా ఎస్వోపీలు రూపొందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ, లాక్డౌన్ అంశాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు.
► భౌతిక దూరం పాటించేలా దుకాణదారులే ముందుకొచ్చే పరిస్థితి రావాలి. వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు కీలకపాత్ర పోషించనున్నాయి. మార్కెట్ ఇంటెలిజెన్స్ విధానం, మార్కెట్ ఇంటర్వెన్షన్ విభాగం చాలా ముఖ్యమైనవి. ఈ రెండు విషయాల్లో సమర్థవంతంగా రైతు భరోసా కేంద్రాలు పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.