మోదీకి పట్టిన గతే కేసీఆర్‌కు: రేవంత్‌

Revanth Reddy Criticises CM KCR For Telangana Budget - Sakshi

కేసీఆర్‌కు, అమరుల కుటుంబాలకు బంధం తెగింది

సీఎం కేసీఆర్ తప్పుడు లెక్కలు.. మాయ మాటలు

ఈ బడ్జెట్‌తో రైతులను పచ్చిగా మోసం చేశారు

బడ్జెట్‌పై రాష్ట్ర సర్కార్‌ను ఎండగట్టిన రేవంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని రంగాల అభివృద్ధికి, వర్గాల సంక్షేమానికి ఉపయోగపడేలా పూర్తి సమతుల్యతతో ఉందని సీఎం కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తగా.. మరోవైపు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తప్పుడు లెక్కలు, మాయ మాటల బడ్జెట్‌తో మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కావలిసిన వారికి, కమిషన్‌లు ఇచ్చేవారికే ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాని, తెలంగాణ సమాజాన్ని మోసం చేసేవిధంగా బడ్జెట్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

గాంధీ భవన్‌లో గురువారం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ ఛాట్‌ చేశారు. అప్పులు తేవడం, అడ్డుగోలుగా ఖర్చు చేయడమే సీఎం కేసీఆర్‌కు తెలుసు. కేసీఆర్ బడి బయట ఉండే విద్యార్థి మాత్రమే. సచివాలయానికి రాని కేసీఆర్‌కు పరిపాలనపై ఎన్నటికీ పట్టు దొరకదు. కేసీఆర్ ప్రభుత్వానికి అమరవీరుల కుటుంబాలు, రైతుల కుటుంబాలు, నిరుద్యోగులు అంటే టీఆర్‌ఎస్ సర్కార్‌కు లెక్కలేదని ఈ బడ్జెట్‌తో తేలిపోయింది. ఈ బడ్జెట్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వానికి, అమరవీరుల కుటుంబాలకు బంధం తెగిపోయింది. ఈ బడ్జెట్ దెబ్బతో నిన్న ప్రధాని నరేంద్ర మోదీకి పట్టిన గతే రేపు కేసీఆర్‌కు పడుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

రేవంత్ ప్రస్తావించిన మరిన్ని అంశాలు ఇవే:

  • ఇప్పటి వరకు టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లలో 30నుంచి 40శాతం లోటు ఉంది 
  • ప్రతిపాదనలు, సవరణలపై కనీస అంచనాలు లేవు. అందుకే పాలనపై కేసీఆర్‌కు పట్టులేదు 
  • డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు 49వేల ఇళ్లకు కూడా సరిపోవు. కేసీఆర్ మూడు లక్షల ఇండ్లు కడతామంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది కేసీఆర్?
  • 2016-17 బడ్జెట్‌లో ఇండ్లకు కేంద్రం ఇచ్చిన ఆరువేల కోట్లనే దారిమళ్లించారు కేసీఆర్ 
  • దళితులకు మూడెకరాల కోసం కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవు
  • సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నాలుగు లక్షలు మంది భూమిలేని దళితులు ఉన్నారు
  • ఫీజు రీయింబర్స్ మెంట్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడం దారుణం. పేదలను విద్యను దూరం చేస్తున్నారు
  • సాగునీటి రంగానికి గతంలో కేటాయించిన నిధులు ఎందుకు ఖర్చు చేయలేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి
  • రాష్ట్రంలో నీళ్లు అందుబాటులో ఉన్న భూమి కోటి ఎకరాలకు పెట్టుబడి రాయితీకి ఆరువేల కోట్లు సరిపోతాయి. కానీ రూ.12 వేల కోట్లు ఎలా ఖర్చు పెట్టారు? లేని భూమికి కేటాయింపులా..? ఇది రైతులను మభ్యపెట్టే చర్య మాత్రమే.  ఈ నాలుగేళ్లలో రైతులపై రుణమాఫీకి సంబందించి రూ. 12వేల వడ్డీ భారం వారిపై పడింది
  • ఈ బడ్జెట్ ద్వారా రైతులకు రుణమాఫీ చేయలేనని కేసీఆర్ చెప్పారు. రైతులను పచ్చిగా మోసం చేశారు. ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో 4200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
  • అమరుల కుటుంబాలకు గతంలో ఇస్తామన్న భూములు, ఉద్యోగాు ఎక్కడికి పోయాయో కేసీఆర్ సమాధానం చెప్పాలి
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top