పేదరిక నిర్మూలన మోదీతోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

పేదరిక నిర్మూలన మోదీతోనే సాధ్యం

Published Thu, Jul 5 2018 4:30 PM

Poverty Reduction Is Possible With Modi Only Said By Cental Minister Suresh Prabhu - Sakshi

వరంగల్‌ రూరల్‌ జిల్లా: తెలంగాణ రాష్ట్రం రాక ముందు..వచ్చాక ఎలాంటి మార్పు రాలేదని, తెలంగాణాలో కానీ దేశంలో కానీ పేదరిక నిర్మూలన జరగాలంటే ఒక్క మోదీతోనే సాధ్యం తప్ప టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలతో కాదని కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు వ్యాఖ్యానించారు. జనచైతన్య యాత్రలో భాగంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నట్లుగా తెలంగాణ ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని తెలిపారు.

స్వాతంత్య్రం వచ్చాక దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పాలించిందని, అయినా కూడా ఇక్కడి ప్రజలు పనుల నిమిత్తం ముంబై వెళ్లాల్సి వచ్చిందంటే.. ఈ ప్రాంతాన్ని ఎలా అణగదొక్కారో అర్ధం అవుతుందన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా..పంటకు మద్ధతు ధర ప్రకటించి.. నా ద్వారా మోదీ ఇక్కడి ప్రజలకు సందేశం పంపించారని తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో పట్టణాల్లో ఉన్న ప్రజలు జీవిస్తున్నట్లుగా.. రైతులు కూడా ఉండాలని అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.  రైతు కుటుంబంలో ఏ ఎక్కరైనా అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం అప్పుల పాలయ్యే పరస్థితి ఏర్పడుతుందని.. ఆ పరిస్థితి మారేందుకు ఆయుష్మాన్‌ భవ పథకం తీసుకురాబోతున్నామని వెల్లడించారు.

కేంద్రం నుంచి వచ్చే నిధులతో ఇక్కడి ప్రభుత్వం కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితి మారాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. వరంగల్‌తో జనసంఘ్‌ పార్టీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే..ఈ జిల్లాకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఇప్పించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దేశ రక్షణ కోసం వరంగల్‌ ప్రజలు ముందుంటారు కాబట్టి మీరంతా బీజేపీ జెండా పట్టుకుని మద్ధతుగా నిలవాలని కోరారు. తాను ఇక్కడ పుట్టనప్పటికీ..తనను ఈ తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపి మంత్రిని చేసినందుకు మీకు రుణపడి ఉంటానని తెలిపారు.

Advertisement
Advertisement