రజనీతో పొత్తా?

Pon Radhakrishnan Comments On Rajinikanth And BJP Alliance - Sakshi

సాక్షి, చెన్నై : నటుడు రజనీకాంత్‌తో పొత్తు గురించి బీజేపీ మాజీ కేంద్ర సహయమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ స్పందించారు. నటుడు రజనీకాంత్‌ ఇంకా పార్టీని ప్రారంభించలేదు. అయినా ఆయన పెట్టే పార్టీ గురించి, ఏ పార్టీలో పొత్తు అనే విషయాల గురించి చాలా కాలంగానే రకరకాల చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక పక్క రజనీ బీజేపీ మద్దతుదారుడనే ముద్ర ఉండనే ఉంది. అయితే  మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, రజనీకాంత్‌ చిరకాల మిత్రుడు కమలహాసన్‌ ఆయనతో పొత్తు పెట్టుకుని రానున్న శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

(చదవండి: శభాష్‌ మిత్రమా రజనీకాంత్‌: కమల్‌హాసన్‌)

ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మాజీ కేంద్ర సహాయమంత్రి పోన్‌ రాధాకృష్ణన్‌ ఆదివారం చెన్నై విమానాశ్రమంలో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పౌరసత్వ బిల్లు గురించి రాష్ట్రముఖ్యమంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పౌరసత్వ బిల్లు వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి శాసనసభలో పేర్కొన్నారన్నారు. అయితే మీడియా పదే పదే దాని గురించి అడగడంతో అవసరం అయితే ఆ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసే విషయమై పరిశీలిస్తామని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పి ఉండవచ్చునని అన్నారు. రజనీకాంత్‌తో బీజేపీ పొత్తు గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ముందు రజనీకాంత్‌ను పార్టీ పెట్టనీయండి అన్నారు. ఆయన పార్టీ జెండా, అజెండా ఏమిటో వెల్లడించాలని, ఆ తరువాత రజనీతో పొత్తు గురించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 

ఇక నటుడు కమలహాసన్‌ విషయానికి వస్తే ఆయన ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఇది సినిమాను నిర్మించడం కాదని, తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమైన అంశం అని అన్నారు. 50 ఏళ్లుగా తమిళనాడు ఎలాంటి అభివృద్ధి లేకుండా వెనుకపడిపోయిందన్నారు. దాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికలు చాలా కీలకం అన్నారు. అన్నాడీఎంకే పార్టీని రాజ్యసభ సీటును కోరతారా అన్న ప్రశ్నకు దాని గురించి ఇంకా ఆ పార్టీని అడగలేదని, అలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా అన్నది తనకు తెలియడం లేదని అన్నారు. అయితే 2021లో జరగనున్న ఎన్నికలకు ఇతర పార్టీల మాదిరిగానే బీజేపీ పార్టీ తయారవుతోందని పోన్‌ రాధాకృష్ణన్‌ అన్నారు. 

రజనీ పార్టీలో ఉపాధ్యక్షుడినవ్వాలనుంది 
కాగా నటుడు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ గురించి తెలియనివారుండరు. ఎందుకంటే అతను నటుడిగా కంటే కూడా వివాదాలతో చాలా పాపులర్‌. పలు కేసులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఆయన ఒక సినిమా వేదికపై మాట్లాడుతూ తన గురించి చాలా అసత్య ప్రచారం జరుగుతోందన్నాడు. తాను చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఎదుగుతున్నానని అన్నారు. తాను నటుడు రజనీకాంత్‌కు చెప్పేదొక్కటేనని, ఆయన పార్టీని ప్రారంభిస్తే తనను అందులో చేర్చుకోవాలని అన్నాడు. తనకు రజనీ పార్టీలో ఉపాధ్యక్షుడిని కావాలన్న ఆశ ఉందన్నాడు. లేదంటే తానే సొంతంగా పార్టీని ప్రారంభిస్తానని పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ పేర్కొన్నాడు. 

రజనీతో ముస్లిం మత గురువులు భేటీ 
కాగా పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లు కారణంగా  ముస్లింలకు ఎలాంటి బాధ ఉండదని, అలా ఏదైనా ఉంటే ముందుగా తానే వ్యతిరేకిస్తానని నటుడు రజనీకాంత్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా శనివారం హజ్‌ కమిటీ అ«ధ్యక్షుడు అబూబక్కర్‌ నటుడు రజనీకాంత్‌ను స్థానిక పోయెస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి వద్ద కలిశారు. పౌరసత్వ బిల్లు వల్ల ముస్లింలకు ఎలాంటి బాధ ఉండదని హామీ ఇచ్చిన రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలపడానికే తాను ఆయనతో భేటీ అయినట్లు అబూబక్కర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ముస్లిం మత పెద్దలు రజనీకాంత్‌ను ఆయన ఇంటి వద్ద కలిశారు. మత పెద్దలు రజనీని కలవడం చర్చకు దారి తీస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top