మోదీ అజెండాలో ముందున్న అంశాలు | PM Narendra Modi Future Agenda | Sakshi
Sakshi News home page

మోదీ అజెండాలో ముందున్న అంశాలు

Nov 12 2019 2:28 PM | Updated on Nov 12 2019 4:49 PM

PM Narendra Modi Future Agenda - Sakshi

ఇక ఇప్పుడు బీజేపీ అజెండాలోని ఏ అంశాలు పరిష్కారానికి ముందుకు రానున్నాయి.

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచే పార్టీ ఎజెండాలో పేర్కొన్న ఒక్కొక్క అంశాన్నే ప్రజల ముందుకు తీసుకొచ్చి పరిష్కరిస్తుందని రాజకీయ పండితులు ముందుగానే భావించారు. దాన్ని నిజం చేస్తూ మోదీ ప్రభుత్వం, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఊహించిన దానికన్నా ముందే అయోధ్య వివాదాన్ని తీసుకొచ్చి కోర్టు సహకారంతో పరిష్కరించింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ అది ఇంత సులభంగా సాధ్యం అవుతుందని ఎవరూ ఊహించలేదు.

ఇక ఇప్పుడు బీజేపీ అజెండాలోని ఏ అంశాలు పరిష్కారానికి ముందుకు రానున్నాయి. అసోం నుంచి బంగ్లాదేశ్‌ ముస్లిం శరణార్థులను వెనక్కి పంపించేందుకు చేపట్టిన కసరత్తు గత రెండు, మూడేళ్లుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. దాదాపు 20 లక్షల మంది ప్రజలు బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి అక్రమంగా అస్సాంలో ఉంటున్నట్లు ‘జాతీయ పౌరసత్వం నమోదు’ కార్యక్రమం తేల్చింది. అంటే వారంతా అసోం స్థానిక పౌరులమని నిరూపించుకోలేక పోయారు. వారి బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లింలే కాకుండా బెంగాల్‌ నుంచి వచ్చిన ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు కూడా ఉన్నారు. ముస్లింలకు మినహా మిగతా మతస్థులకు భారత పౌరసత్వం కల్పించి, ముస్లింలను బంగ్లాదేశ్‌కు పంపించాలన్న బీజేపీ అజెండా. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధం చేసింది. దాన్ని ఆమోదించి, ముస్లింలను వెనక్కి పంపించే ప్రక్రియను ఇప్పుడు చేపట్టాల్సి ఉంది.

ముస్లిం మహిళల కోసం ‘ట్రిపుల్‌ తలాక్‌’ను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని మతాల వారికి వర్తించే ‘ఉమ్మడి పౌర స్పృతి’ని తీసుకురానుంది. అప్పుడు ఇప్పుడున్నట్లుగా ముస్లింలకు ప్రత్యేక వివాహ చట్టాలు ఉండవు. ఆ తర్వాత పటిష్టమైన మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకరానుంది. ప్రస్తుతం రాష్ట్రాల వారిగా ఈ చట్టాలు ఉన్నాయి. కేంద్ర స్థాయిలో లేదు. హిందువులైన దళితుల్లో ఎక్కువ మంది క్రైస్తవంలోకి మారుతున్నందున దాన్ని నివారించడం కోసం ఈ చట్టాన్ని తీసుకొస్తానని బీజేపీ మొదటి నుంచి చెబుతోంది.

ఇది సరే, పార్టీ అజెండా అమలు చేయడంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించిన బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక దుస్థితిపై దృష్టిని కేంద్రీకరించక పోవడంతో అది మరింతగా దిగజారుతోంది. దేశంలో గత 49 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 6.1 శాతంతో గరిష్ట స్థాయికి చేరుకుందని నివేదికలు పేర్కొన్నాయి. అయినా సరైన చికిత్సా చర్యలు లేకపోవడంతో ఆ సమస్య ఇప్పుడు దాదాపు 8 శాతానికి చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement