
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. కాంగ్రెస్తో కలిసి మిత్రపక్షంగా బరిలో దిగుతుందని భావించిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఒంటరి పోరుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది.
కాంగ్రెస్తో కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని తొలుత భావించామని, చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, అయితే ఆ పార్టీ తాత్సారం చేస్తుండడంతో తాము సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. అన్ని సీట్లకు పోటీ చేయాలని ఏడాదిన్నర క్రితం నుంచే సిద్ధమయ్యామని, ఇపుడు ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించామని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఒంటరి పోరుతో అత్యధిక స్థానాలను గెలుచుకోగలమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక 77 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ జాబితా ప్రకటించిన మర్నాడే ఎన్సీపీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు హార్దిక్తో మంతనాలపై కూడా గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.