
కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన ముఖేష్ అంబానీ
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దియోరకు మద్దతు ఇచ్చారు. మిలింద్ దక్షణ ముంబైకి సరైన నాయకుడని అంబానీ చెబుతున్న వీడియోను కాంగ్రెస్ అభ్యర్థి ట్వీట్ చేశారు. దక్షిణ ముంబై నుంచి పది సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన మిలింద్ దియోర ఈ నియోజకవర్గ సామాజికార్థిక సాంస్కృతిక వ్యవహారాలపై లోతైన అవగాహన ఉందని ఈ వీడియోలో అంబానీ చెప్పుకొచ్చారు.
మరోవైపు కొటాక్ మహింద్ర బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటక్ కూడా మిలింద్ అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఈ వీడియోలో కనిపించారు. దియోర ముంబైకి సరైన ప్రాతినిధ్యం వహించే వ్యక్తని కొనియాడారు. ముంబైలో వ్యాపారాలను పూర్వపు స్థితికి తీసుకురావడం, మన యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి తేవడం అవసరమని పేర్కొంటూ దియోర దీటైన వ్యక్తని ఉదయ్ కొటక్ ప్రశంసించారు. ఏప్రిల్ 29న జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్లో దియోర శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్తో తలపడుతున్నారు.