ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్ దేశలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గిఫ్ట్ సిటీ’ సారథ్య బాధ్యతలను చేపట్టారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ(గిఫ్ట్ సిటీ) కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్గా ఆయనను నియమిస్తూ గుజరాత్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
హస్ముఖ్ అధియా స్థానంలో కోటక్
గత ఏడాది జూన్ నుంచి గిఫ్ట్ సిటీ బోర్డు ఛైర్మన్గా (నాన్-ఎగ్జిక్యూటివ్) సేవలు అందించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ హస్ముఖ్ అధియా స్థానంలో ఉదయ్ కోటక్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పట్టణ గృహనిర్మాణ శాఖ ఈ మేరకు గురువారం ఒక తీర్మానాన్ని విడుదల చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని, ఆయన పాత్రకు సంబంధించిన ఇతర నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుందని డిప్యూటీ సెక్రటరీ అంకితా షా సంతకం చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గిఫ్ట్ సిటీ: ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రం
గుజరాత్లోని 886 ఎకరాల్లో విస్తరించి ఉన్న గిఫ్ట్ సిటీ భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్థిక, సాంకేతిక హబ్. వ్యాపారాలకు సులభతర వాతావరణాన్ని కల్పిస్తూ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులిస్తారు. ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు సుస్థిరత, అత్యాధునిక సాంకేతికతకు కీలకంగా మారుతున్నాయి.
ఉదయ్ కోటక్..
1985లో కేవలం రూ.30 లక్షల పెట్టుబడితో ఒక చిన్న బిల్లు డిస్కౌంట్ సంస్థను స్థాపించిన ఉదయ్ కోటక్, నేడు కోటక్ మహీంద్రా బ్యాంక్ను దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా తీర్చిదిద్దారు. ప్రాథమికంగా ఎటువంటి పెద్ద కార్పొరేట్ నేపథ్యం లేకపోయినా పారదర్శకత, క్రమశిక్షణతో కూడిన బ్యాంకింగ్ విధానాలతో కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నారు. 2003లో బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన మొదటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా కోటక్ మహీంద్రా రికార్డు సృష్టించింది. భారత ఆర్థిక రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2026 సంవత్సరంలో ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.
ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..


