
కోల్కతా / న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం యడ్యూరప్ప మూడ్రోజుల ప్రభుత్వం కూలిపోవడం ప్రాంతీయ శక్తుల విజయమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యం విజయం సాధించింది. కర్ణాటక ప్రజలకు, దేవెగౌడకు, కుమారస్వామికి, కాంగ్రెస్ సహా ఇతర నేతలకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు. యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోవడం లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల విజయమని సీపీఐ నేత డి.రాజా తెలిపారు. కర్ణాటకలో శనివారం ప్రజాతీర్పు ధన బలంపై విజయం సాధించిందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు. కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయిన ఘటనతో బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సూచించారు. బీజేపీ ప్రభుత్వం కూలిపోవడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ‘అబద్ధాలు, అబద్ధాలకోరును సత్యమే ఓడిస్తుంది’ అని ట్వీట్ చేశారు.