breaking news
democary
-
మీ ఓటుతో ప్రేమను చూపండి
నాగర్కర్నూల్: పిల్లల భవిష్యత్కు సంకల్పంతో ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ.శ్రీధర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ‘మీ ఓటుతో మీ ప్రేమను చూపండి’ అనే సంకల్ప కరపత్రాన్ని కలెక్టర్ విడుదల చేసి మాట్లాడారు. సంకల్ప పత్రాలను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందజేయాలని అన్నారు. కుటుంబ సభ్యులు ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ ఓటును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకునేలా సంకల్ప పత్రాలను తల్లిదండ్రులకు అందించి కుటుంబ సభ్యులకు ఓటు విశిష్టత తెలియపర్చాలని అన్నారు. దీనికోసం సంకల్ప పత్రాలను అన్ని పాఠశాలలకు పంపిణీ చేసి ప్రతి విద్యార్థికి అందేలా చూడాలని డీఈఓ గోవిందరాజులును ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్రెడ్డి, డీఆర్వో మధుసూదన్నాయక్, డీఈఓ గోవిందరాజులు, ఐసీడీఎస్ పీడీ ప్రజ్వల, జిల్లా అధికారులు అనిల్ప్రకాష్, మోహన్రెడ్డి, సుధాకర్, సాయిసుమన్, జయంత్కుమార్రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బాలల వెట్టి చాకిరిని అరికట్టాలి జిల్లాలో బాలల వెట్టి చాకిరిని అరికట్టాలని కలెక్టర్ ఈ.శ్రీధర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో బాండెడ్ లేబర్ విజిలెన్స్, చైల్డ్ లేబర్ టాస్క్ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బడిఈడు పిల్లలను పనిలో చేర్చుకుని వెట్టి చాకిరి చేయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో, 18 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండేవిధంగా చూడాలన్నారు. పిల్లలను ఎక్కడైనా పనిలో పెట్టుకున్నట్లు కనిపిస్తే 1098కు సమాచారం అందజేయాలని తెలిపారు. హోటళ్లు, కిరాణషాపులు, రాత్రిళ్లు ఇటుక బట్టీల వద్ద పిల్లలను పనిలో ఉంచుకుంటే యజమానికి జరిమానా విధించడమే కాక జైలుశిక్ష వేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు లేబర్ను తరలించే దళారులు, గుంపు మేస్త్రీలకు భారీ జరిమానా విధించాలని అన్నారు. ఎన్జీఓలు, ఇతర సంఘాలు సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని కోరారు. లేబర్ను ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో కార్మికుల వివరాలు తెలిపి సర్టిఫికేట్ పొందాలన్నారు. జిల్లాలో ఇంకా బాండెడ్ లేబర్ ఎక్కడైనా ఉంటే వారిని గుర్తించి తగిన ఆర్థిక, సామాజిక సహకారం అందించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో బాండెడ్ లేబర్, చైల్డ్ లేబర్ లేకుండా చేసేందుకు సంబంధిత శాఖలు కృషిచేయాలని తెలిపారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్రెడ్డి, డీఆర్వో మధుసూదన్నాయక్, జిల్లా అధికారులు సాయిసుమన్, రవీందర్రెడ్డి, ప్రజ్వల, గోవిందరాజులు, సుధాకర్, జయంత్కుమార్, అనిల్ ప్రకాశ్, మధు, పలు ఫౌండేషన్ల సభ్యులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛను లొంగదీసే దొంగాట!
ప్రజాస్వామ్య ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ‘ఓటరు’ స్వేచ్ఛను ఆట వస్తువు చేస్తున్నారు. కోరిన రీతిన వంచుతున్నారు. ఓటు విలువను పలుచన చేస్తున్నారు. ప్రజా స్వామ్యంలో తనకిష్టమైన పాలకులను నిర్ణయించుకునేందుకు, తన మనోగతాన్ని వెల్లడి చేసేందుకు బలమైన ఆయుధం ‘ఓటు’. లాటిన్ అమెరికా సాహితీ ప్రపంచంలో వేగుచుక్క అనదగ్గ కవి, రచయిత, జర్నలిస్టు, సామాజిక వేత్త అయిన జోస్ మార్టి (క్యూబా) మాటల్లో చెప్పాలంటే.. ‘‘అన్నింటి కన్నా ఓటు అత్యంత సున్నితమైన విశ్వాసం. ఓటరు ప్రయోజనం మాత్రమే కాదు అతని జీవితం, పరువు, భవిష్యత్తు కూడా ఓటుతో ముడివడి ఉన్నాయి’’ ‘‘పైసల్ తీస్కొని ఓటేసుడా..? థూ... ఓటుకు పైసల్ తీస్కునుడంటే, పానం (జీవితం) అమ్ము కున్నట్టు లెక్క పటేలా! ఇజ్జత్ (పరువు) అమ్ము కున్నట్టు’’ సరిగ్గా ముఫ్ఫై ఏళ్ల కింద... 1989లో జరిగిన ఎన్నికలప్పుడు మెదక్ జిల్లా మారుమూల గ్రామం యెనగండ్ల (మా ఊరు)లో 42 ఏళ్ల వయసున్న ఒక వ్యవసాయ దినకూలీ అన్నమాటలివి. దాన్ని అవగాహన అనాలో, చైతన్యం అనాలో, నైతికత అనాలో, మరేమనాలో తెలియదు. నాటి పరిస్థితిని నేటితో పోలిస్తే... ఎన్నో రెట్లు అవగాహన పెరిగింది. చైతన్యం రగిలింది. నైతికతే దిగజారింది. ఓటుకింత అనే లెక్కలో తమకు తక్కువ డబ్బులిచ్చారని ఒక వార్డు వాసులు ఓ రాజకీయ పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగే పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ‘ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు 11 కోట్ల రూపాయలు ఖర్చయింది’ అని రాజ్యాంగ హోదా అనుభవిస్తున్న ఓ బడా నేత నిర్భయంగా ప్రకటించుకునే పరి స్థితి! ఓటర్ల జాబితా సవరించాకా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పేరిటే హైదరాబాద్లో రెండు ఓట్లున్న దుస్థితి! ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నామో, దాని విలువను దిగజార్చే పరి స్థితులు, పరిణామాలే అంతకు పలు రెట్లు అధికమవుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడన్నట్టు ఆ పాతకానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యక్తులే కాక వ్యవస్థలూ కారణమవుతున్నాయి. ఏదో రీతిన ఓట్లు దండు కొని గద్దె నెక్కాలనే నాయకులు, ఓటరు జాబితాలు తారుమారు చేసే పార్టీ గణాలు, ఎన్నికల ప్రక్రియను ప్రహసనం చేసే అధికార యంత్రాం గం, ఓటు హక్కునే విస్మరిస్తున్న ‘నాగరికులు’, విడిగా–ఉమ్మడిగా వెల కట్టి అమ్ముకుంటున్న ఓటర్లు... ఇలా అన్ని వైపుల నుంచీ ఓటు విలువను దిగజారుస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థనే నవ్వుల పాల్జేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద, ఓటు విలువపైన విశ్వాసమున్న వారి నమ్మకం రోజు రోజుకు సడలిపోయేలా పరిస్థితులు విషమిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లపై తెలెత్తిన వివాదం గోటిచుట్టపై రోకటి పోటులా తయారయింది. మళ్లీ బ్యాలెట్కు వెళ దామా? అనే చర్చ–మీమాంస పుట్టుకొస్తోంది. ఎన్నిసార్లు సవరణ ప్రక్రియ చేపట్టినా... తప్పుల తడిక ఓటరు జాబితాలు సగటు ఓటరును వెక్కిరిస్తున్నాయి. వ్యవస్థల్ని చెరబట్టిన రాజకీయ దళారీలు ఈ జాబి తాల్ని కలుషితం చేస్తున్నారు. లక్షల దొంగ ఓట్లను చేర్చడం ద్వారానో, తమకు ఓటేయరనే భయంతో లక్షలాది అసలు పేర్లను తొలగిస్తూనో అరాచకం సృష్టిస్తున్నారు. ఈ నేర ప్రక్రియ క్రమంగా ప్రమాదకర స్థాయిలో వ్యవస్థీకృతమవుతోంది. ఎన్నికల సంఘం వైపు వేలు ప్రక్షాళన పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితాలను అత్యంత కలుషితం చేశారు. నిన్నటికి నిన్న అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలంగాణలో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి. రేపు ఎన్నికలు జరగా ల్సిన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది దొంగ, నకిలీ ఓట్లొచ్చి జాబితాలో తిష్ట వేశాయి. ప్రక్షాళనకోసం వాడుతున్న సాఫ్ట్వేర్ లోపభూయిష్టమే కాకుండా నిర్వహణ ప్రక్రియలోనూ అనేక లోపాలున్నాయి. వివిధ స్థాయిల్లో అధికార యంత్రాంగం అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారహి తంగా వ్యవహరించింది. జవాబుదారితనం లేకుండా యథేచ్ఛగా వ్యవ హరించి ఓటరును నిమిత్తమాత్రుడిని చేసింది. ఓటు నమోదు, తొల గింపు ద్వారా సవరణ, ప్రక్షాళన ప్రక్రియల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద పౌరుల (ఓటర్లుగా)కున్న హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాసింది. తెలిసి కొంత, తెలియక ఇంకొంత నేడున్న దురుద్దేశపు రాజకీయ వ్యవ స్థకు ఊడిగం చేస్తోంది. తెలంగాణలో చాలా చోట్ల జాబితాను ఓటర్లు తనిఖీ చేసినపుడు తమ పేరుంది, నంబరుంది... దాన్ని ఆధారం చేసుకొని తగిన గుర్తింపు కార్డుతో పోలింగ్ స్టేషన్కు వెళితే పేరు లేదు, ఓటే లేదు. ఓటేయకుండానే ఉస్సురంటూ వెనక్కి రావలసి వచ్చింది. ‘అవును 22 లక్షల ఓట్లను తొలగించామ’ని ఎన్నికల ప్రధానాధికారే అంగీకరించిన వాస్తవం. వివాదమిప్పుడు న్యాయస్థానం పరిధికి చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల దొంగ/నకిలీ ఓట్లు రాష్ట్ర ఓటర్ల జాబితాలో చేరినట్టు ఓ నిపుణుల బృందం శాస్త్రీయంగా నిరూపించింది. ఎన్నికల సంఘం దీన్ని పాక్షికంగా అంగీకరించి, తిరిగి సవరణ చేప డితే... పెనంలోంచి పొయిలో పడ్డట్టు, ఇప్పుడు మరో 6 లక్షలు నకిలీ ఓట్లు అదనంగా వచ్చి చేరాయి. దాదాపు 25 లక్షల నకిలీ ఓట్లున్న మాట నిజమే అని రాష్ట్ర ఎన్నికల (కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తప్పించిన) ముఖ్యాధికారే స్వయంగా అంగీకరించి ఆమేరకు ప్రకటన వెలువరిం చారు. ప్రపంచమే అచ్చెరువొందేలా ఓ పెద్ద ఎన్నికల ప్రక్రియని దశా బ్దాల తరబడి నిర్విఘ్నంగా, ప్రశాంతంగా కొనసాస్తూ కీర్తి కిరీటం దక్కిం చుకున్న భారత ఎన్నికల సంఘం ఈ వైఫల్యాలకు జవాబు చెప్పు కోవాల్సి వస్తోంది. సగటు ఓటరు ముందు దోషిగా నిలబడింది. ఓటరు జాబితాలోంచి పేర్లు తొలగిస్తున్నపుడు పాటించాల్సిన చట్టబద్ద ప్రక్రి యను తూతూ మంత్రంగా నిర్వహించారు. అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కల్పించకపోగా, ఎవరికి వారు ఆన్లైన్లో తనిఖీ చేసుకొని పేరు లేకుంటే, సంప్రదించి చేర్పించుకోవచ్చని బాధ్యతని ఓటరుపైకి నెట్టారు. వివిధ దశల్లో పాటించాల్సిన పారదర్శకతను మంటగలిపారు. రాజ్యాం గం కల్పించిన హక్కును హరించి అదనపు బాధ్యతను పౌరుల నెత్తిన రుద్దారు. సవరించిన జాబితాల్లోనూ తప్పులా! తప్పుడు, అక్రమ, రిపీట్, చెల్లని, దొంగ, బహుళ.... ఇలా వివిధ రూపాల్లో ఉన్న నకిలీ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం అధికారులు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ సమగ్రంగా లేదు. ఫలితంగా ఒకే వ్యక్తికి వివిధ పోలింగ్ స్టేషన్ల పరిధిలో పలు ఓట్లుంటున్నాయి. తండ్రి/ భర్త పేరు మార్పుతో, ఇంటి నంబరు మార్పుతో, మగ–ఆడ అన్న లింగవైవిధ్యంతో ఒకరికే వేర్వేరు చోట్ల ఓట్లుంటున్నాయి. ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండగలిగిన చిన్న ఇళ్లల్లో కూడా వందలాది ఓట్లుం టున్నాయి. ధ్రువీకరించడం తేలిగ్గా సాధ్యపడే కొన్ని తప్పిదాల్ని కూడా ఆధికార యంత్రాంగం ఇప్పుడు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ పట్టుకోలేక పోతోంది. అది దుస్సాధ్యమైందేమి కాదు, ప్రయివేటు వ్యక్తులు, సంస్థల వద్ద కూడా లభ్యమయ్యే సాధారణ సాఫ్ట్వేర్ అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓటర్లుగా ఉన్న ఒకే వ్యక్తిని కూడా ఇప్పుడు అధికారులు వాడుతున్న సాఫ్ట్వేర్ పట్టుకోలేకపోతోంది. ఫలి తంగా రెండు, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల్లో ఓటున్న వారి సంఖ్య 18.5 లక్షలున్నట్టు ప్రయివేటు నిపుణుల సంస్థ తేల్చింది. ఓటరు ఐడి, ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటి నంబరు, వయసు, జెండర్, పేరు వెనుక–ముందు... ఇలా పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకొని లెక్కిం చినపుడు ఏపీలో పెద్ద సంఖ్య నకిలీ ఓట్లు దొరికాయి. 13 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, 45,920 పోలింగ్ బూత్ల పరిధిలోఉన్న 3.6 కోట్ల ఓటర్ల సమాచారాన్ని తీసుకొని శాస్త్రీయంగా తనిఖీ–విశ్లేషణ చేసి మరో 34.17 లక్షల (వెరసి 52.67 లక్షల) నకిలీ ఓట్లున్నట్టు తేల్చారు. ఇదంతా బట్టబయలై జరిపిన తాజా సవరణ తర్వాత కూడా జాబితా తప్పుల తడికే! మళ్లీ ఒకే వ్యక్తి పేరిట నాలుగేసి ఓటరు కార్డులు కూడా జారీ చేశారు. సవరణ తర్వాత... అసలు ఇంటి నంబరు, నిజమైన వయసు, వాస్తవిక జెండర్తో సవరించిన పేర్లు జాబితాలోకి వచ్చాయి. అదే సమయంలో, పాత (నకిలీ) పేర్లూ తుది జాబితాలో కొనసాగుతు న్నాయి. మీ ఇంట్లో, మీకు తెలియకుండా అయిదారుగురు పైశాచి (గోస్ట్) ఓటర్లుంటారు. ఇలాంటి ‘బోగస్’ ఓట్లు ఇంకెన్నో! మొత్తమ్మీద ఇదీ తెలుగునాట నెలకొన్న దుస్థితి! పెత్తనం కోసం సంపద వికృత రూపం అన్ని వ్యవస్థల మీద రాజకీయ పెత్తందారీతనం పెరిగి అటువైపు ఆకర్షణ అధికమైంది. ఏదో రూపంలో రాజకీయాధికారం దక్కించుకో వాలి. సంపద కలిగిన వారికి ఇదింకా మోజయింది. అడ్డదారి సంపాదన ఉన్న వారు వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసైనా అధికారం చేజిక్కించుకోవా లని ఆరాటపడుతున్నారు. ఓటరు జాబితాల్లో కూడికలు, తీసివేతలు చేస్తూ తమ ఓట్ల పంట పండించుకుంటున్నారు. లేదంటే, ప్రత్యర్థులకు ఓట్ల కరువు తీసుకువస్తున్నారు. మధ్యలో ‘ఓటర్’ను బలిపశువు చేస్తు న్నారు. పెరుగుతున్న ఆర్థిక అంతరాలు ఈ పరిస్థితులకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. నిన్న ముగిసిన శాసనసభ ఎన్నికల్లో డబ్బు ఎంతగా ఖర్చ యిందో అందరికీ తెలుసు. ఈ రోజు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఎవరున్నా, తెరవెనుక ఆట నడుపుతున్న ఈ ‘నికృష్ట సంపదే’ వారిని ఆడిస్తోంది. పట్టణాలు, నగరాలు, పారిశ్రామిక వాడల నుంచి వనరులు గ్రామానికి వరదై పారుతున్నాయి. ఎక్కడికక్కడ డబ్బు, మధ్యం ఏరులై ప్రవహిస్తోంది. ఓటుకింతని డబ్బు పెట్టి కొంటున్నారు. ఓటర్లనే కాదు, గంపగుత్తగా కుటుంబాలను, వాడలను వశపరచుకుంటు న్నారు. ఏదో రూపంలో ప్రలోభపెడుతున్నారు. లొంగని చోట బయ పెడుతున్నారు. పై స్థాయి నుంచే, ఓటర్లయిన పౌరుల చేతికి నికరంగా డబ్బు వచ్చేలా ‘పథకాలు’ పన్ని వేర్వేరు స్కీముల్లో వారిని ఇరికిస్తు న్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ‘ఓటరు’ స్వేచ్ఛను ఆట వస్తువు చేస్తున్నారు. కోరిన రీతిన వంచుతున్నారు. ఓటు విలువను పలుచన చేస్తున్నారు. ఓటరు చైతన్యమొకటే దీనికి విరుగుడు. ఓటరు గట్టిగా నిలబడాలి. డబ్బు పంచినా, ప్రలోభపెట్టినా తన ‘ఓటు’ హక్కు భంగపోకుండా స్వతంత్రంగా వ్యవహరించాలి. స్వేచ్ఛగా ఓటేయాలి. బాహ్య ప్రేరకాలెలా ఉన్నా... స్వేచ్ఛగా ఓటేసే తన హక్కుని అవి ప్రభా వితం చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో తన కిష్టమైన పాలకులను నిర్ణ యించుకునేందుకు, తన మనోగతాన్ని వెల్లడి చేసేందుకు బలమైన ఆయుధం ‘ఓటు’. లాటిన్ అమెరికా సాహితీ ప్రపంచంలో వేగుచుక్క అనదగ్గ కవి, రచయిత, జర్నలిస్టు, సామాజిక వేత్త అయిన జోస్ మార్టి (క్యూబా) మాటలతో ముగిస్తా. ‘‘అన్నింటి కన్నా ఓటు అత్యంత సున్నితమైన విశ్వాసం. ఓటరు ప్రయోజనం మాత్రమే కాదు అతని జీవితం, పరువు, భవిష్యత్తు కూడా ఓటుతో ముడివడి ఉన్నాయి’’ (నేడు జాతీయ ఓటరు దినోత్సవం) దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఇది ప్రాంతీయ, లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల విజయం
కోల్కతా / న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం యడ్యూరప్ప మూడ్రోజుల ప్రభుత్వం కూలిపోవడం ప్రాంతీయ శక్తుల విజయమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యం విజయం సాధించింది. కర్ణాటక ప్రజలకు, దేవెగౌడకు, కుమారస్వామికి, కాంగ్రెస్ సహా ఇతర నేతలకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు. యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోవడం లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల విజయమని సీపీఐ నేత డి.రాజా తెలిపారు. కర్ణాటకలో శనివారం ప్రజాతీర్పు ధన బలంపై విజయం సాధించిందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు. కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయిన ఘటనతో బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సూచించారు. బీజేపీ ప్రభుత్వం కూలిపోవడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ‘అబద్ధాలు, అబద్ధాలకోరును సత్యమే ఓడిస్తుంది’ అని ట్వీట్ చేశారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతోంది
ఎమ్మెల్సీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి కర్నూలు (ఓల్డ్సిటీ): రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతోందని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి విమరి్శంచారు. శుక్రవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అబద్ధాలు తప్ప మరొకటి మాట్లాడటం లేదని, ఉద్యమం చేస్తే పీడీ యాక్టు పెట్టాలని చెప్పడం అప్రజాస్వామికమన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం రాకపోతే రూ. 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను మోసం చేశారన్నారు. గ్లోబల్ ప్రచారం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆయన మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. అనంతపురం జిల్లాలో పంట ఎండిపోయిన తర్వాత రైన్గన్లతో నీళ్లు చిలకరించి, రూ. 170 కోట్ల ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. రైతుల భూములు లాక్కొని సింగపూర్లో బిజినెస్ చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణానికి అనుకూలత, భద్రత కలిగిన భవనం ఉండాలే తప్ప 'అద్భుతమైన రాజధాని' అనడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు 10 నెలల పీఆర్సీ చెల్లించలేదన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్నే కొనసాగించాలని కోరారు. తనపై నమ్మకంతోనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్సీ అవకాశం కల్పించారన్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, డిప్లొమా హోల్డర్లు నవంబరు 5వ తేదీ లోపు నమోదు చేయించుకోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య మాట్లాడుతూ ఓటర్లను చేర్పించుకునే బాధ్యత వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. మనమేంటో నిరూపించుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు తోడ్పడతాయన్నారు. జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ అందరు కలిసికట్టుగా రాజగోపాల్రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.