ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

Mallu Bhatti Vikramarka Meets Speaker In Banswada - Sakshi

సాక్షి, బాన్సువాడ: పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్‌ నాయకులు కోరారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీలు మంగళవారం స్పీకర్‌ను బాన్సువాడలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తాజాగా పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని.. ఇది రాజ్యాంగ విరుద్దమని వారు స్పీకర్‌కు వివరించారు. 

అనంతరం స్పీకర్‌ నివాసంలో భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..ఇంతకు ముందు కూడా పార్టీ ఫిరాయించిన 6 గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా పార్టీ ఫిరాయించిన హరిప్రియ నాయక్‌, కందాల ఉపేందర్‌రెడ్డి, జూలాల సురేందర్‌, చిరుమర్తి లింగయ్యలను డిస్‌ క్వాలిఫై చేయాలని నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని అన్నారు. అనేక ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌ హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల బాన్సువాడకు వచ్చి కలిసినట్టు పేర్కొన్నారు.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఒక ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తామంటూ.. ఇటీవల అధికార పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ప్రకటన చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ విలీనం అనేది చాలా పెద్ద వ్యవహారం అని పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడూ.. గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకు అందరి తీర్మానాలను ఎన్నికల సంఘానికి పంపడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేసామని గుర్తుచేశారు.

షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు. డిస్‌ క్వాలిఫై నోటీసు ఇస్తున్న సమయంలో స్పీకర్‌ ఫొటో తీసుకోవడానికి కూడా అనుమతించలేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. జాతీయ పార్టీలో ఓ ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top