ఏపీలో ‘108’ అంబులెన్సుల కొను‘గోల్‌మాల్‌’ 

Laxman Reddy Comments on Chandrababu Govt - Sakshi

చంద్రబాబుది అవినీతి పాలన:మాజీమంత్రి లక్ష్మారెడ్డి 

షాద్‌నగర్‌టౌన్‌: ఏపీ సీఎం చంద్రబాబు అవినీతి పాలన కొనసాగిస్తున్నారని, ‘108’ అంబులెన్సుల కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయని మాజీమంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరోపించారు. సోమవారం ఇక్కడి టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనావ్యవహారాలపై ఇటీవల సీఎం కేసీఆర్‌ నిజాలు మాట్లాడారని, అవి నచ్చకపోవడంతో ఆంధ్రామంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబుపై ఎన్నో కేసులు ఉన్నాయని, విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకొని చంద్రబాబు బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఒకే నమూనాలో ఉన్న అంబులెన్సులను కొనుగోలు చేశాయని, తెలంగాణ ప్రభుత్వం   ఒక్కో వాహనాన్ని రూ.15 లక్షలకు కొనుగోలు చేస్తే, చంద్రబాబు రూ.20 లక్షల చొప్పున కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు ఆంధ్రా ప్రజల సొమ్మును భారీగా దోచి ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్‌ నేతల కోసం తరలించారని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసమే సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్, బీజేపీ రహిత ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసేందుకు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారని లక్ష్మారెడ్డి అన్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top