‘ఎల్లో’ వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం 

Kodali Nani Fires On Chandrababu Naidu - Sakshi

15 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇచ్చినా కోత పెట్టారంటూ పచ్చ మీడియా ప్రచారం 

సంక్రాతితో పాటు అమ్మ ఒడి, రైతు భరోసా 

పండుగలు వాటికి కనబడటం లేదు 

మంత్రి కొడాలి నాని ధ్వజం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎల్లో వైరస్‌.. చైనాలోని కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరంగా పరిణమించిందని, ఎల్లో మీడియాకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ మాత్రం కనిపించడం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఓ వైపు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంటే.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేవారని, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం 54 లక్షల మందికి పింఛన్లు ఇస్తోందని మంత్రి చెప్పారు.

కొత్త సంవత్సరంలో సంక్రాంతితో పాటు రాష్ట్రంలో అమ్మ ఒడి, రైతు భరోసా అనే రెండు పండుగలు వచ్చాయన్నారు. అవేవీ ఎల్లో మీడియాకు కనబడటం లేదని మండిపడ్డారు. ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారని, అమ్మ ఒడి పథకం కింద 82 లక్షల మంది విద్యార్థులకు సాయం చేశారని చెప్పారు. పింఛన్లు తీసుకునేందుకు వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి భావించారని.. అందుకే గ్రామ వలంటీర్ల ద్వారా వారి ఇళ్లకే పంపిస్తున్నారన్నారు. కేవలం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పసుపు–కుంకుమ కింద చంద్రబాబు డబ్బులు ఇస్తే డబ్బా మీడియా ఊదరగొట్టిందని.. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోపే కోటి మందికి పైగా ఆర్థిక సాయం చేస్తే అసలు ఈ మీడియాకు పట్టడం లేదన్నారు.  

చంద్రబాబు 420 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను దించేసి రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని వనరులను దోచుకోవాలని చంద్రబాబు, ఎల్లో మీడియా చూస్తున్నాయని మంత్రి కొడాలి మండిపడ్డారు. ఆంధ్రజ్యోతిలో ‘ఏడు నెలల్లో ఏడు లక్షల పింఛన్లు కట్‌’ అంటూ అసత్య కథనాలు ప్రచురించడం దుర్మార్గమన్నారు. ఎల్లో మీడియాకు బాస్‌ అయిన చంద్రబాబు నీచుడని ఎద్దేవా చేశారు. అందుకే వైఎస్‌ జగన్‌ ఇచ్చిన వాగ్దానాలను వమ్ము చేశారంటూ.. ఆయనపై 420 కేసులున్నాయి కనుక జనాన్ని కూడా మోసం చేస్తున్నారంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారని ధ్వజమెత్తారు. ‘వాస్తవానికి చంద్రబాబుది 420 బతుకు. ఆయన పుట్టిన నెల 4. తేదీ 20.

పుట్టుకతోనే ఆయనను మించిన 420 మరొకరు లేరు’ అని మండిపడ్డారు. జేసీ దివాకర్‌రెడ్డికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదని, ఎవరు అధికారంలో ఉంటే వారికి 40 ఏళ్లుగా చిడతలు కొడుతూ తన అక్రమ వ్యాపారాలతో రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబు బూట్లు నాకి సిమెంట్‌ ఫ్యాక్టరీకి 500 హెక్టార్లు తీసుకున్న వ్యక్తి జేసీ అని నాని పేర్కొన్నారు. యనమల రామకృష్ణుడి మెదడు చెడిపోయి చాలా కాలమైందని, బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయంపై తమ ఎంపీలు కేంద్రం ఎదుట నిరసన తెలుపుతున్నారని చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top