టీడీపీపై మరోసారి కేశినేని నాని ట్వీట్..
సాక్షి, అమరావతి: టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని సొంత పార్టీపై విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘తెలుగుదేశానికి ఇప్పుడు విషయం ఉన్నవాళ్లు కావాలి... షో చేసే వాళ్ళు కాదు’ అని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు.
చంద్రబాబు ప్రకటించిన పార్లమెంటరీ పార్టీ పదవులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అలక వహించి గతంలో ఫేస్బుక్లో వెటకారంగా పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబును ఉద్దేశించి చంద్రబాబు వైఎస్సార్సీపీలోకి వెళితే తాను బీజేపీలో చేరతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్గా తనకిచ్చిన పదవులను తిరస్కరిస్తున్నానని కేశినేని నాని గతంలో స్పష్టం చేశారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా గల్లా జయదేవ్ను నియమించడంపై అసంతృప్తితో ఉన్న నాని బీజేపీలోకి ఫిరాయిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, గతకొన్ని రోజులుగా సొంత పార్టీపైనే కేశినేని నాని వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం గమనార్హం.