
చెన్నై : తమిళనాడులో విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా.. పెరియార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వెల్లూరులోని ఆయన విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై కొందరు పెట్రో బాంబులు విసిరారు. పెరియార్ విగ్రహ ధ్వంసంపై రాజకీయ పార్టీలు భగ్గుముంటున్నాయి.
తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు కమల్ హాసన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. పెరియార్ విగ్రహాల ధ్వంసాన్ని ద్రవిడ జాతి క్షమించజాలదని ఆయన పేర్కొన్నారు. పెరియార్ విగ్రహాలపై వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి రాజాపై చర్యలు అవసరం లేదని అనడం ప్రభుత్వ హేయమైన చర్య అంటూ మండిపడ్డారు. రాజా క్షమాపణలు కూడా అంగీకరించకూడదని, ఇది క్షమించరాని నేరమని అన్నారు. బీజేపీ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. పెరియార్ విగ్రహాలను తాము కాపాడుకోగలమని, కానీ పెరియార్పై అటువంటి ఆలోచన వచ్చినా ద్రవిడ జాతి క్షమించబోదని పేర్కొన్నారు. కావేరీ నదీ జలాల అంశంపై దృష్టి మళ్లించేందుకే పెరియార్ విగ్రహాల అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.