నాడు మద్దతిచ్చి.. నేడు కూటమా? | Jeevan Reddy question to the CM KCR | Sakshi
Sakshi News home page

నాడు మద్దతిచ్చి.. నేడు కూటమా?

Mar 5 2018 2:24 AM | Updated on Aug 15 2018 9:04 PM

Jeevan Reddy question to the CM KCR - Sakshi

సాక్షి, జగిత్యాల: సీఎం కేసీఆర్‌ నాలుగేళ్లుగా కేంద్ర నిర్ణయాలకు మద్దతిచ్చి.. నేడు మూడో కూటమిని ఏర్పాటు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లా డుతూ.. ఈ నాలుగేళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను ఏ మేరకు అమలు చేశారో ముందుగా తెలుసుకోవా లని చెప్పారు. ‘నాయనా నువ్వు.. జాతీయ స్థాయిలో ఏ చక్రం తిప్పుతావో తిప్పు పర్వాలేదు. ముందు రాష్ట్రం సంగతిని పట్టించుకో.

రైతు సమస్యలపై దృష్టి పెట్టు. నీ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకతపై దృష్టిపెట్టు’ అని వ్యాఖ్యానించారు. ఎయిమ్స్‌ ఏర్పాటు, గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, హైకోర్టు విభజనపై ముందుగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాపై డీపీఎస్‌ అనుమతి కోసమైనా ప్రతిపాదనలు పంపారా? అని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీకి మద్దతు తెలిపిన కేసీఆర్‌.. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన మీరాకుమార్‌ను కాదని ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికి ఎలా మద్దతు తెలిపారని నిలదీశారు. ముస్లిం రిజర్వేషన్ల ఫైలు కేంద్రం వద్ద ఉంటే ఎందుకు చలనం లేకుండా ఉన్నారని విమర్శించారు. నాటి జై తెలంగాణ నినాదం.. జైఆంధ్రాగా మారిందని ఎద్దేవా చేశారు. ‘నాడు ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన జైరాం రమేశ్‌ను హరీశ్‌రావు ద్రోహి అన్నారు.. ఇప్పుడు కేసీఆర్‌ ఏపీ హోదా గురించి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఏమని పిలవాలని జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. 

యంత్రలక్ష్మి పథకం పేరిట రూ.300 కోట్ల అవినీతి  
యంత్రలక్ష్మి పథకం పేరిట.. రాష్ట్రంలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ వాళ్లే రైతులనే భావన సరికాదన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే సబ్సిడీ ట్రాక్టర్లు మంజూరు చేశారన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement