హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక : ముగిసిన పోలింగ్‌ | Huzurnagar By Election Polling Live Updates | Sakshi
Sakshi News home page

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక : ముగిసిన పోలింగ్‌

Oct 21 2019 8:07 AM | Updated on Oct 24 2019 8:23 AM

Huzurnagar By Election Polling Live Updates - Sakshi

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.

సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మట్టంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నిక ఫలితాన్ని అక్టోబరు 24న ప్రకటిస్తారు.

  • హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా
    పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్టు సమాచారం. సాయంత్రం 5 గంటల్లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటువేసే అవకాశం కల్పించనున్నారు.

  • హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 75 శాతం పోలింగ్‌ నమోదైంది. 5 గంటలకు పోలింగ్‌ ముగియనుంది. కాగా, పోలింగ్‌ ముగిసేందుకు సమయం దగ్గరపడుతుంటడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

  • మధ్యాహ్నం 3గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, గత ఎన్నికల్లో ఇక్కడ 88 శాతం పోలింగ్‌ నమోదవడం విశేషం. ఇక ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.
     
  • సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురంలో ఎన్నికల అధికారుల సమన్వయ లోపం ఇబ్బందులు వస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పద్మావతి ఉత్తమ్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పద్మావతి గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలను చెదరగొట్టారు. ఇక పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అసహనంతో వెనుదిరుగుతున్నారు.
     
  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు హుజూర్‌ నగర్‌లో 52 శాతం పోలింగ్‌ నమోదైంది.
     
  • హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక గతంలో ఇక్కడ 88శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి ఉపఎన్నిక కావడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ గరిడేపల్లి మండలం పోనుగొడు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. 

     
  • కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి పోలింగ్‌ సరళిని పరిశీలిస్తూ నియోజకవర్గాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన ఓటు కోదాడలో ఉండటంతో ఇక్కడ ఓటు వేయలేకపోతున్నందుకు బాధగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పోలింగ్‌ పూర్తయ్యేలా చూడాలని ఆమె ఓటర్లకు విఙ్ఞప్తి చేశారు.
     
  • హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఉదయం 11 గంటల వరకు 31.34 శాతం పోలింగ్ నమోదైంది.

మొరాయించిన ఈవీఎంలు..

నేరేడుచర్ల మండలంలోని చింతబండలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ను నిలిపివేసి... అధికారులు ఈవీఎంలను సరిచేస్తున్నారు. మరోవైపు చింతకుంట్లలోని పోలింగ్ కేంద్రంలో వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ గుర్తులు గుర్తించడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు.

  • పోలింగ్‌ సరళిని జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఉదయం తొమ్మిది గంటల వరకు 13.44 శాతం పోలింగ్‌ నమోదైంది.


కాగా హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన భార్య పద్మావతి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ కోటా రామారావుకు బీఫాం ఇచ్చి బరిలో నిలిపింది. ఇక ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక కేసీఆర్‌ సర్కారుకు సవాలుగా మారింది. కార్మికులను పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణి అనుసరిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ఎన్నిక ఫలితాలను రిఫరెండంగా తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో ఉప ఎన్నికపోరు రసవత్తరంగా మారింది.

పోలీస్‌ పహారాలో..
పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్‌ బందోబస్తు చేపట్టారు. మొత్తం 2,350 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు చేస్తున్నారు. 6 కంపెనీల కేంద్ర బలగాలు, 5 కంపెనీల తెలంగాణ స్పెషల్‌ పోలీస్, జోన్‌ పరిధిలోని జిల్లాల నుంచి అదనపు సిబ్బంది, 10 స్పెషల్‌ పార్టీలు, డాగ్‌ స్క్వాడ్స్, టాస్క్‌ఫోర్స్, 27 రూట్‌ మొబైల్స్, 7 క్విక్‌ రియాక్షన్‌ టీమ్స్‌ బందోబస్తులో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement