జల విజయం టీఆర్‌ఎస్‌దే..

Harish Rao Jala Vijaya Yatra Tour In nagarkurnool district - Sakshi

జల విజయ యాత్రలో మంత్రి హరీశ్‌రావు

టీఆర్‌ఎస్‌ లేకుంటే కేఎల్‌ఐ పూర్తికి మరిన్ని ఏళ్లు పట్టేది  

కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో రైతులే బుద్ధిచెప్పాలి  

వచ్చే ఏడాది నుంచి రైతులకు

సాగునీటితోపాటు పెట్టుబడి వ్యయం ఇస్తాం

సాక్షి, నాగర్‌కర్నూల్‌/ తెలకపల్లి:  కాంగ్రెస్‌ పార్టీ అ ధికారంలో ఉన్న పదేళ్లలో రైతుల గోడు ఏనాడూ ప ట్టించుకోలేదు, కానీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లలో రైతులకు నీరందించాలని ప్రయత్నిస్తుం టే కాళ్ల మధ్యలో కట్టె పెడుతున్న చందంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం నాగర్‌క ర్నూల్‌ జిల్లాలోని తెలకపల్లి మండలం లక్నారంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్‌ఐ) కాలువల వెంట పాదయాత్రగా జలవిజయ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం బీడుగా మారడానికి కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. కేఎల్‌ఐ పథకం పూర్తి చేసే విషయంలో ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి లేదని, ఇక్కడి రైతులు కష్టాల్లోనే మునిగి తేలాలన్నదే వారి దుర్నీతి అని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులకు రాత్రివేళ విద్యుత్‌ లేక ప్రమాదాలకు గురై మృతిచెందారని అన్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్‌ పాటుపడుతుందని, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేసి పనులు జరుగకుండా అడ్డుకుంటున్నది కాంగ్రెస్సేనని అన్నారు. ప్రజలు, రైతులు వారికి బుద్ధిచెప్పాలని, ప్రాజెక్టులు అడ్డుకునే కాంగ్రెస్‌కు ఎలాంటి శిక్ష వేయాలో మీరే నిర్ణయించాలని ప్రజలకు సూచించారు.

మూడేళ్లలోనే పనులు పూర్తి...
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేశారన్నారు. ఐదున్నర లక్షల ఎకరాలకు నీరందించేందుకు టీఆర్‌ఎస్‌ కృషిచేస్తుందని తెలిపారు. కేఎల్‌ఐలో రూ.600కోట్లు వెచ్చించామని అన్నారు. వచ్చే సంవత్సరంలో మరో వెయ్యి కోట్ల బడ్జెట్‌ పెట్టి పూర్తి స్థాయిలో రైతులకు నీరందిస్తామన్నారు. కేఎల్‌ఐ వెంట రాత్రింబవళ్లు తిరుగుతూ పూర్తి చేస్తున్నామన్నారు. ఆవంచలో కాలువల పనులను పూర్తి చేయించి నీరందించామని చెప్పారు. పెద్దవాగుపై నిలబడి బ్రిడ్జిలు ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులు తీర్చామన్నారు. రైతులకు ఎక్కడెక్కడ కాలువల వెంట బ్రిడ్జిలు నిర్మించాలి, అసంపూర్తి పనుల గురించి రైతులతో అడిగి తెలుసుకునేందుకే జలవిజయ యాత్ర కొనసాగిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే మర్రితోపాటు ఇరిగేషన్‌ అధికారులు కూడా పాల్గొంటారని అన్నారు.  

ఎరువులు, విత్తనాలకు రూ.8వేలు ఇస్తాం..
వచ్చే సంవత్సరం నుంచి రైతులకు ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఎకరాకు రూ.8వేలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి సాగుకు నిర్విరామంగా విద్యుత్‌ అందిస్తామన్నారు. నీళ్లు వృథా కాకుండా ఆటో స్టార్టర్లను తొలగించుకోవాలని రైతులకు చెప్పారు.

 రైతుల అవసరాలు గుర్తించని కాంగ్రెస్‌ నాయకులు..
కాంగ్రెస్‌ హయాంలో పొన్నాల లక్ష్మయ్య నీళ్ల మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, రైతుల అవసరాలు కూడా గుర్తించలేని మంత్రిగా కొనసాగారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఇటీవల అచ్చంపేటలో ప్రజాగర్జన పేరుతో నిర్వహించిన సభ కేవలం ఓట్ల కోసమేనని, ప్రజల కోసంకాదన్నారు. ఈ ప్రాంతాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రైతుల కష్టనష్టాలు తెలుసుకుని, తీర్చేందుకే ఈ పాదయాత్ర చేపడుతున్నారని అన్నారు. అనంతరం లక్నారం ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన కేఎల్‌ఐ పైలాన్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే మర్రి పాదయాత్ర పెద్దూరుకు చేరుకుంది. పెద్దూరు, ఆలేరు గ్రామాల మధ్యనున్న కేఎల్‌ఐ బ్రిడ్జి పక్కన రాత్రికి బస చేస్తారు. అక్కడి నుంచి గట్టురాయిపాకుల, పెద్దపల్లి మీదుగా పాదయాత్రను కొనసాగించనున్నారు. ఈసందర్భంగా మహిళా సంఘాలకు రూ.కోటి 15లక్షల చెక్కును మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అందించారు. సాయిచంద్, కళాబృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే రాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, హన్మంతురావు, జెడ్పీటీసీ సభ్యులు నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top