మురళి ఆత్మహత్యపై అనుమానాలున్నాయ్‌: అద్దంకి

doubts on murali suicide - Sakshi

హైదరాబాద్‌ : ఓయూ విద్యార్థి మురళి ముదిరాజ్‌ ఆత్మహత్య వెనక అనుమానాలున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిథి అద్దంకి దయాకర్‌ తెలిపారు. గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఈ ఘటనపై సర్కార్ సిట్టింగ్ జడ్జితో గానీ, రిటైర్డ్ జడ్జితో కానీ విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఓయూకు రెండు మూడు కంపెనీల పోలీస్ లు ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసులను ఓయూకు పంపడం వెనక సర్కార్ కుట్ర దాగివుందని ఆరోపించారు. బాహుబలిలోని త్రిశూల వ్యూహం లెక్క పోలీసులను క్యాంపస్ లోకి పంపించారని వెల్లడించారు.

 తాము ఓయూలో ఎలాంటి గొడవ చేయలేదని, తామే గదిలోకి వెళ్లి గడి పెట్టుకుని స్వచ్ఛంద నిర్బంధం చేసుకున్నామని తెలిపారు. కేవలం మురళి కుటుంబానికి న్యాయం చేయమని, ఆర్థిక సాయం చేయమని మాత్రమే కోరామని తెలిపారు. డిసెంబర్ 3న శ్రీకాంత చారి సూసైడ్ చేసుకున్నాడు, అదేరోజు మురళి సూసైడ్ చేసుకున్నాడని వివరించారు. ఈ పాలన రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ పాలన లెక్క అన్పిస్తుందని చెప్పారు. జైల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేయాలని, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఉద్యోగాల భర్తీ కోసం విద్యార్థులు మరో మిలిటెంట్ ఉద్యమానికి సిద్ధం కావాలని మరో నేత దరువు ఎల్లన్న పిలువునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top