చివరకు దినకరన్‌కు దక్కింది ఇదే!

Dinakaran Faction lost Hat Symbol  - Sakshi

సాక్షి, చెన్నై : ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌కు ప్రెషర్‌ కుక్కర్‌ గుర్తును కేటాయించినట్లు ప్రకటించింది. 
  
రెండాకుల గుర్తు పళని-పన్నీర్‌ గ్రూప్‌కు చెందుతుందని ఇటీవలె ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో తమకు కేటాయించిన టోపీ గుర్తునే కేటాయించాలంటూ దినకరన్‌ ఈసీని అభ్యర్థించారు. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు కాగా.. టోపీ గుర్తును శశికళ-దినకరన్‌ వర్గానికి ఎలా కేటాయిస్తారంటూ ఈసీపై కోర్టు ప్రశ్నలు గుప్పించింది. ఆ ప్రభావమో లేక మరేయితర కారణమో తెలీదుగానీ ఎన్నికల సంఘం మాత్రం ఆ గుర్తును కొంగునాడు మున్నేట్ర కగజమ్‌ అభ్యర్థికి రమేష్‌కు కేటాయించి, దినకరన్‌ కు ప్రెషర్‌ కుక్కర్‌ ను కేటాయిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. దీనిపై స్పందించిన దినకరన్‌ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకే ఈ గుర్తు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొనటం విశేషం.

కాగా, డిసెంబర్‌ 21 న జరగబోయే ఎన్నిక కోసం మొత్తం 145 నామినేషన్లు నమోదుకాగా ఈసీ 72 అభ్యర్థుల నామినేషన్లను మాత్రమే అంగీకరించింది. గత నలభై ఏళ్లలో 11 సార్లు డాక్టర్‌ రాధాకృష్ణన్‌(ఆర్కే నగర్‌) నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించగా.. అన్నాడీఎంకే పార్టీ 7 సార్లు ఘన విజయం సాధించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top