నేటితో కేసీఆర్‌ పీడ విరగడ: ఉత్తమ్‌

Congress releases poll manifesto - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ రద్దు సిఫారసు జరిగితే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలన ముగిసినట్లేనని, దీంతో రాష్ట్రానికి పట్టిన కేసీఆర్‌ పీడ విరగడైనట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కుంభం శివకుమార్‌రెడ్డి తన అనుచరులతో కలసి మాజీ మంత్రి డి.కె.అరుణ నేతృత్వంలో బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇప్పటివరకు నియంత పాలన కొనసాగిందని, టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యువత, మహిళా, రైతు, నిరుద్యోగ, విద్యార్థుల తోపాటు అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ మాట ఇచ్చిందంటే అమలు చేసి తీరుతుందని గతంలో ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి అనేక పథకాలే నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా శివకుమార్‌రెడ్డికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌.సి.కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసుబాబు, సలీంలు కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శివకుమార్‌రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ నేతలు అభిజయ్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top