
రాష్ట్ర రాజకీయాల్లో దిగజారిన విలువలకు సాక్షీభూతం.. 2018. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది ఈ ఏడాదే. చంద్రబాబు ఏలుబడిలో రాజ్యాంగం ఖూనీ అయింది. అధికార బలంతోవ్యవస్థలను నిర్వీర్యం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టపగలే తాకట్టు పెట్టారు. అధికార తెలుగుదేశం పార్టీ క్షుద్ర రాజకీయాలకు 2018 సంవత్సరమే సాక్ష్యం. తిరగబడేజనాన్ని.. ఎగిసిపడే జగన్ ప్రభంజనాన్ని చూసి చంద్రబాబు హడలిపోయిందీ ఈ ఏడాదే. గతి తప్పిన రాజకీయ రహదారిలో చంద్రబాబు నైతిక విలువలూ కోల్పోయిందీ ఈ సంవత్సరమే.
అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షంపై దూషణలు
ఈ ఏడాదంతా ప్రతిపక్షం లేకుండానే శాసనసభ జరిగింది. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు శాసనసభకు హాజరు కాలేదు. దీంతో అధికార పక్షం రెచ్చిపోయింది. సభలో లేని ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నాయకుడిని నోటికొచ్చినట్టు దూషించడమే అధికార పార్టీ విధానంగా మారింది. ఈ ఏడాది శాసనసభలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చ జరిగిన దాఖలాలే లేకపోవడం గమనార్హం. ప్రజలకు ఉపయోగకరమైన ఏ ఒక్క నిర్ణయమూ తీసుకోలేదు. అధికార పార్టీ సొంత డబ్బాకు అసెంబ్లీ వేదికవ్వడం 2018లో కనిపించిన మరో దృశ్యం.
కుట్రల బాబు... కుయుక్తుల కాలం
వెకిలి పోకడలకు, మకిలి రాజకీయాలకు 2018 వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పొడవునా తీసుకున్న యూటర్న్లు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు ఉప్పు పాతరేశారు. ప్యాకేజీ గొప్పదని తేల్చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ తగ్గిందనే భావనతో చంద్రబాబు రూటు మార్చారు. నాలుగేళ్లపాటు కేంద్రంతో సాగిస్తున్న కాపురాన్ని తెగదెంపులు చేసుకున్నారు. నిన్న మొన్నటి దాకా మోదీని ఆకాశానికెత్తిన చంద్రబాబు అంతలోనే మాటల దాడి పెంచారు. ప్రత్యేక హోదా సాధనే ఊపిరిగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న పోరాటం 2018లో తారస్థాయికి చేరింది. హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో వైఎస్సార్సీపీ నిలదీసింది. అవిశ్వాసం అస్త్రాన్ని సంధించింది. పార్టీ ఎంపీలు పదవులను తృణప్రాయంగా వదిలేశారు. హోదా కోసం పదవులు వదులుకున్న వైఎస్సార్సీపీకి ప్రజాదరణ పెరుగుతుండడంతో సీఎం చంద్రబాబు మాట మార్చేశారు. ధర్మపోరాట దీక్షలంటూ కొత్త డ్రామాలకు తెరతీశారు.
దిగజారుడు రాజకీయం
చంద్రబాబు దిగజారుడు రాజకీయం ఈ ఏడాది పరాకాష్టకు చేరింది. మోదీ జోడీ విడిచిపెట్టిన బాబును అవినీతి భూతం కలవరపెట్టింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకున్న బాబుకు వెన్నులో చలిపుట్టింది. ఎక్కడో ఐటీ, ఈడీ దాడులు జరిగితే తన గుట్టు బయటకొస్తుందని బెంబేలెత్తిపోయారు. ఐటీ దాదులను రాష్ట్రంపై కేంద్రం దాడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. చంద్రబాబు రాజకీయ నైతిక విలువలకూ తిలోదకాలివ్వడం ఈ ఏడాది మరో వైపరీత్యంగా చెప్పాలి. దశాబ్దాలుగా సైద్ధాంతిక విభేదాలున్న కాంగ్రెస్ పార్టీతో అపవిత్ర పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతో పొరుగు రాష్ట్రం తెలంగాణలో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ అనైతిక పొత్తును తెలంగాణ ప్రజలు అసహ్యించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టిగా గుణపాఠం చెప్పారు.
మతి తప్పిన మాటలు
2018లో సీఎం చంద్రబాబు చేసిన పలు వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసలు ఆయనకు ఏమైందనే అనుమానం రాజకీయ వర్గాలనూ వెంటాడింది. చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి కారణాలు లేకపోలేదు. అదిగో అమరావతి... ఇదిగో అసెంబ్లీ... అదిగదిగో సచివాలయం... అంటూ ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తూ కాలం గడిపేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికల సభలో విచిత్రంగా మాట్లాడారు. హైదరాబాద్ను తానే నిర్మించానని, తెలంగాణలోని అన్నీ తానే తీసుకొచ్చానని చెప్పడం ఈ ఏడాది జోక్గా జనం ఇప్పటికీ చెప్పుకుంటారు. తాను ప్రచారం చేసిన తెలంగాణలో ప్రజాకూటమికి పుట్టగతుల్లేకుండా పోయినా... కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నెగ్గడం తన దయే అంటూ బాబు నోటివెంట రావడం 2018లో ప్రజలను విస్మయపరిచింది. విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు విషపు నవ్వులు నవ్వడం యావత్ రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యపరిచింది. రక్తసిక్తమైన విపక్ష నేతపై ఇసుమంతైనా సానుభూతి చూపని చంద్రబాబు కర్కశత్వానికి 2018 సంవత్సరమే కన్నీరు పెట్టిందేమోనని పలువురు వ్యాఖ్యానించారు.