బాబువి ఊసరవెల్లి రాజకీయాలు | Botsa Satyanarayana and Roja Slams CM Chandrababu | Sakshi
Sakshi News home page

బాబువి ఊసరవెల్లి రాజకీయాలు

Jun 18 2018 2:38 AM | Updated on Jul 12 2019 3:10 PM

Botsa Satyanarayana  and Roja Slams CM Chandrababu - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తిరుపతి రూరల్‌: తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. తన అవినీతిపై విచారణ జరగకుండా ఉండటం కోసమే బీజేపీకి చెందిన వారి బంధువులను సలహాదారులుగా పెట్టుకున్నారని, టీటీడీ బోర్డులో కూడా సభ్యులుగా నియమించారని విమర్శించారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు సమావేశానికి హాజరైన బొత్స సత్యసత్యనారాయణ, ఎమ్మెల్యే ఆర్కే రోజా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఎవరి స్థాయిలో వారు దోచుకుంటున్నారని, పంచభూతాలను సైతం వదలడం లేదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో సెస్‌ను విధించి ప్రజలపై పెట్రోల్, డీజిల్‌ భారం భారీగా మోపుతోందని ఆరోపించారు. ప్రభుత్వం చేతకానితనంతో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే ప్రజల ముందుకు వెళ్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

చంద్రబాబు సీమ ద్రోహి: ఆర్కే రోజా
రాయలసీమ అభివృద్ధికి గుండెకాయ వంటి కడప ఉక్కు పరిశ్రమ, మన్నవరం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి సీఎం చంద్రబాబు సీమద్రోహిగా నిలిచారని నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. యువతకు ద్రోహం చేస్తున్న చంద్రబాబును తరిమికొట్టి.. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement