ఆదివారం గవర్నర్‌తో ద్వివేది భేటి | Sakshi
Sakshi News home page

ఆదివారం గవర్నర్‌తో ద్వివేది భేటి

Published Fri, May 24 2019 5:00 PM

AP CEO Gopalakrishna Dwivedi Seeks Governor Narasimhan Appointment - Sakshi

సాక్షి,అమరావతి : రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఉదయం 11.30 గంటలకు భేటికానున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల జాబితాతో కూడిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆయన గవర్నర్‌కు అందజేయనున్నారు. ద్వివేదితో పాటు అడిషనల్‌ సీఈవోలు వివేక్‌ యాదవ్‌, సుజాత శర్మలు కూడా గవర్నర్‌తో సమావేశం కానున్నారు. గెలుపొందిన సభ్యులు జాబితాను గవర్నర్‌ అమోదించిన తర్వాత శాసనసభ్యుల వివరాలతో  రాజపత్రాన్ని ప్రచురించనున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటులో అధికారిక లాంఛనాలు పూర్తయ్యాక  సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల వివరాలతో  రాజపత్రాన్ని ప్రచురించేందుకు  ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఇప్పటికే అన్ని నియోజక వర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు సంబంధిత ఆర్వోలు ధృవీకరణ పత్రాలను అందచేశారు.

శనివారం ఉదయం తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.  గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఎన్నుకోనున్నారు.  అనంతరం జగన్‌ గవర్నర్‌తో భేటీ అవుతారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు  అవకాశమివ్వాలని గవర్నర్‌ను జగన్‌ కోరుతారు. మరోవైపు  రాష్ట్రంలో అత్యధిక స్థానాలున్న పార్టీగా వైఎస్సార్‌సీపీ అవరతరించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జగన్‌ను గవర్నర్‌ కోరవచ్చు.  ఎన్నికల సంఘం నుంచి  ఎన్నికైన శాసనసభ్యుల వివరాలను గెజిట్‌లో ముద్రించేందుకు గవర్నర్‌ అనుమతించిన వెంటనే ఆ జాబితాతో గెజిట్‌ రూపొందుతుంది. ఈ అధికారిక లాంఛనాలు పూర్తైన వెంటనే  కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది.

Advertisement
Advertisement