మోదీ, తేజస్వి యాదవ్‌ ఓ ఛాలెంజ్‌

Accept my challenge now: Tejashwi Yadav dares PM Narendra Modi - Sakshi

సాక్షి, పట్నా: భారతీయులందరూ ఫిట్‌గా ఉండాలంటూ  కేంద్ర  క్రీడా శాఖమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌  ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’  పేరుతో విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు  ప్రముఖ సినీ నటీనటులు,  క్రికెటర్లతో సహా పలువురు సెలబ్రిటీలనుంచి స్పందన విపరీతంగా వస్తోంది.  ఈ నేపథ్యంలో ట్విటర్‌లో ఇపుడు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే  ఇప్పటికే  పెట్రో ధరలపై   స్పందించిన బిహార్‌ ప్రతిపక్ష నేత, ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు,  తేజస్వి యాదవ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై  మరోసారి విమర్శలు గుప్పించారు.  పెట్రోల్‌,డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటూ  ఫేస్‌బుక్‌లో మండిపడిన తేజస్వి  తాజాగా ట్విటర్‌లో మోదీకి ఓ పొలిటికల్‌ ఛాలెంజ్‌ విసిరారు.   కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు  ప్రధాని మోదీ స్పందించడంతో తేజస్వి యాదవ్‌ ఈ ట్వీట్‌ చేశారు. దీంతో ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ కాస్తా  రాజకీయ టర్న్‌ తీసుకుంది. 

క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను స్వీకరించడంలో తనకు ఎలాంటి అభ‍్యంతరం లేదంటూనే...నా చాలెంజ్‌ను కూడా స్వీకరించండి మోదీ అంటూ క్రికెటర్‌ కూడా అయిన తేజస్వి యాదవ్‌ తన దాడిని ఎక్కు పెట్టారు.  యువతకు ఉద్యోగాలు కావాలి, రైతులకు ఉపశమనం కల్పించండి. దళితులు, మైనారిటీలపై హింసను నిరోధిస్తామని హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.   మోదీగారు నా సవాల్‌ను  స్వీకరిస్తారా అంటూ తేజస్వి యాదవ్‌  ట్వీట్‌  చేశారు.

కాగా  స్వయంగా పుషప్స్‌ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయడంతోపాటు బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌‌కు రాథోడ్‌ సవాలు విసిరారు.  దీంతోపాటు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా వారి స్నేహితులను కూడా నామినేట్‌ చేయాలని సూచించారు.  దీనికి స్పందన భారీగానే లభించింది.  ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ  స్పందిస్తూ..ప్రధానికి సవాల్‌ విసరడం ప్రముఖంగా నిలిచింది. అంతేకాదు ఈ సవాల్‌ను  స్వీకరించిన మోదీ త్వరలోనే తాను కూడా వీడియోను పోస్ట్‌ చేస్తానంటూ గురువారం ట్వీట్‌ చేశారు.  దీంతో  ఇది వైరల్‌గా మారిన సంగతి విదితమే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top