‘ఆన్లైన్’లో యోగా చేర్చండి
సాక్షి, న్యూఢిల్లీ: సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ విధానంలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న విద్యాసంస్థలు.. ఈ విద్యావిధానంలో యోగాను కూడా చేర్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కరోనా మహమ్మారి విజృం భిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలోని ప్రతి ఒక్కరికీ అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగా ఓ అద్భుతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం స్పిక్ మెకే సంస్థ నిర్వహించిన డిజిటల్ యోగా అండ్ మెడిటేషన్ శిబిరం’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఆన్లైన్లో యోగా సాధకులకు సందేశాన్నిచ్చారు. పాఠశాల స్థాయినుంచే యోగాభ్యాసాన్ని అలవర్చడం ద్వారా భవిష్యత్ భారతాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు వీలుంటుందని ఆకాంక్షించారు. చిన్నారుల కోసం 13 యోగాసనాల జాబితాను ‘యునిసెఫ్ కిడ్ పవర్’ప్రస్తావించడంపై ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.