ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) అధికారి హత్య కేసులో ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) అధికారి హత్య కేసులో ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 10న దక్షిణ ఢిల్లీ సుబ్రతొ పార్క్లోని తన నివాసంలో 40 ఏళ్ల రమేష్ చంద్ర హత్యకు గురయ్యారు. రమేష్ భార్య సుధ చంద్ర తన టీనేజ్ ప్రేమికుడు (17)తో కలసి ఆయనను చంపేసింది. సుధ ప్రేమికుడు మరో ఐఏఎఫ్ అధికారి కుమారుడని పోలీసులు తెలిపారు. వీరు పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తారు.
రమేష్ను చంపేసిన తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చిందని సుధ ఇరుగుపొరుగు వారికి చెప్పింది. వెంటనే ఆయనను చికిత్స కోసం మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే రమేష్ను గొంతునులిమి చంపేసినట్టు పోస్ట్మార్టమ్ నివేదికలో వెల్లడైంది. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. పోలీసుల విచారణలో తొలుత తనకేం తెలియదన్న సుధ అనంతరం నేరం అంగీకరించింది. ఆమె ప్రేమికుడిని బాలనేరస్తుల కేంద్రానికి తరలించారు. సుధ, రమేష్ దంపతులు ఉత్తరప్రదేశ్కు చెందినవారు. వాళ్లకు నాలుగేళ్ల పాప ఉంది. ఏడాది క్రితం పక్కింట్లో ఉండే యువకుడితో సుధకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం రమేష్కు తెలియడంతో మద్యానికి బానిసయ్యాడు. వివాహ సంబంధం విచ్చిన్నమయ్యే పరిస్థితి ఏర్పడటంతో సుధ రమేష్ను చంపేసిందని పోలీసులు చెప్పారు.