ఆధ్యాత్మికతకు భారత్ రాజధాని
మైసూరు (శ్రావణ బెళగొళ): ప్రాచీన సంప్రదాయాలతో భారతదేశం విరాజిల్లుతోందనీ, ప్రపంచంలో ఆధ్యాత్మికతకు భారత్ రాజధాని అని ఉపరాష్ట్రపతి వెంకయ్య వ్యాఖ్యానించారు. శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరుని మహామస్తకాభిషేకాల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. చావుండరాయ వేదికపై కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఆధ్యాత్మికంగా, ధార్మికంగా ఘనచరిత్ర కలిగిన కర్ణాటకలో జరుగుతున్న బాహుబలి మహామస్తకాభిషేకాల్లో పాల్గొనడం తనకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమన్నారు. మన ఆచార, వ్యవహారాలను చూసి ఎవ్వరూ సిగ్గుపడనక్కర లేదన్నారు. మన పూర్వీకులు, గురువుల నుంచి నేర్చుకున్న సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందజేయాలన్నారు.