లెక్కల్లో లేని డబ్బుపై 60% పన్ను! | Unaccounted deposits post demonetisation likely to attract up to 60% tax | Sakshi
Sakshi News home page

లెక్కల్లో లేని డబ్బుపై 60% పన్ను!

Nov 25 2016 8:41 AM | Updated on Apr 3 2019 5:16 PM

లెక్కల్లో లేని డబ్బుపై 60% పన్ను! - Sakshi

లెక్కల్లో లేని డబ్బుపై 60% పన్ను!

బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్న లెక్కల్లోలేని డబ్బుపై 60 శాతం ఆదాయపు పన్ను విధించాలని కేంద్రం యోచిస్తోంది.

ఐటీ చట్టంలో సవరణకు కేంద్రం యోచన
ఆకస్మికంగా భేటీ అయిన కేంద్ర కేబినెట్..
►  జన్‌ధన్ అకౌంట్లలో డిపాజిట్లపై చర్చ


న్యూఢిల్లీ: బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్న లెక్కల్లోలేని డబ్బుపై 60 శాతం ఆదాయపు పన్ను విధించాలని కేంద్రం యోచిస్తోంది. గురువారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నోట్లరద్దు తర్వాతి పరిణామాలపై చర్చించారు. జన్‌ధన్ అకౌంట్లలో రూ.21వేల కోట్లకు పైగా డబ్బులు చేరినట్లు వెల్లడైన నేపథ్యంలో అత్యవసరంగా జరిగిన ఈ భేటీ ఆసక్తిగా మారింది. కేబినెట్ భేటీ సమావేశం వివరాలను వెల్లడించనప్పటికీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం లెక్కల్లోలేని డబ్బును డిపాజిట్ చేస్తే దానిపై 60 శాతం ఆదాయపు పన్ను విధించటంపై చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వం నోట్లరద్దుపై ప్రకటన చేసినప్పటినుంచీ.. పలుమార్లు చేసిన అధికారిక ప్రకటనల వల్ల పన్ను చెల్లించని వారిపై తీవ్ర పరిణామాలు తప్పదనే సంకేతాలు వెలువడ్డాయి. 30 శాతం ఐటీకి తోడు అదనంగా 200 శాతం పన్ను విధించొచ్చని కొందరు అధికారులు వెల్లడించారు. కానీ, దీనికి ఐటీ చట్టం వీలు కల్పించటం లేదు.

ప్రస్తుతం పెద్దమొత్తంలో డబ్బు అకౌంట్లలోకి చేరుతున్నందున.. పన్ను రేటును మార్చేందుకు ఆదాయపు పన్ను చట్టానికి ఈ శీతాకాల సమావేశాల్లోనే సవరణలు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. నల్లధనంపై 45 శాతానికి పైగా పన్ను విధించాలనే (60 శాతం వరకు) ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. బ్యాంకులు, ఆర్బీఐ ద్వారా డబ్బులు మార్చుకోని వారిపై అదనంగా 60 శాతం పన్ను విధించనున్నట్లు సమాచారం. జన్‌ధన్ యోజనతోపాటుగా బినామీ అకౌంట్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని, దేశీయ బంగారు నిల్వలను పరిమితం చేయటంపైనా కేబినెట్లో చర్చించినట్లు తెలిసింది.

నవంబర్10 నుంచి డిసెంబర్ 30 వరకు రెండున్నర లక్షల రూపాయలకు పైగా.. డబ్బులు జమ అవుతున్న అకౌంట్లపైనా 200 శాతం పన్ను వేస్తామని ఐటీశాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా చాలా మంది డబ్బును తగలబెట్టిన ఘటనలు తెరపైకి వచ్చాయి. దీంతో లెక్కల్లో లేని రూ.500, వెరుు్య నోట్లను కాల్చటం, నదుల్లో పారేయటానికి బదులుగా డిపాజిట్ చేయాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. రద్దైన నోట్లను డిపాజిట్ చేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు డిపాజిట్ పథకాలు, బాండ్‌లు తీసుకొచ్చే యోచనలోనూ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement