
రక్షాబంధన్ కానుకగా మరుగుదొడ్డి
రక్షాబంధన్... ఈ పేరు వినగానే ఎవరికైనా గుర్తుకొచ్చేదేమిటంటే అన్నాచెల్లెళ్లు ఆ రోజు ఒకచోటికి చేరుకుని తమ బంధాన్ని నెమరువేసుకోవడం.
రక్షాబంధన్... ఈ పేరు వినగానే ఎవరికైనా గుర్తుకొచ్చేదేమిటంటే అన్నాచెల్లెళ్లు ఆ రోజు ఒకచోటికి చేరుకుని తమ బంధాన్ని నెమరువేసుకోవడం. ఇంకా చెప్పాలంటే వారికి ఓ పర్వదినం. ఆ రోజున రాఖీ కట్టిన సోదరికి వారి వారి స్తోమతను బట్టి సోదరుడు కానుకలు ఇవ్వడం ఆనవా యితీ. అది వారి బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు దోహదం చేస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
అయితే ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా వాసులు మాత్రం రాఖీ పండుగను విభిన్నంగా జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. రక్షాబంధన్ సమీపిస్తున్న నేపథ్యంలో పారిశుధ్యంపై జిల్లా స్వచ్ఛతా సమితి ‘విభిన్న అమేథీ–విభిన్న సోదరుడు’ అనే ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ పథకం కింద ఇప్పటివరకూ మొత్తం 854 మంది సోదరులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా వీరంతా తమ సోదరీమణులకు మరుగుదొడ్డిని కానుకగా ఇవ్వనున్నారు. సోదరులు ఇచ్చే డబ్బుతో సోదరీమణుల ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మించనున్నారు.