సమాధి అవుతా.. సహకరించండి! | Swami Vairagyanand Seeks Go-Ahead For Immolation | Sakshi
Sakshi News home page

సమాధి అవుతా.. సహకరించండి!

Jun 15 2019 2:37 PM | Updated on Jun 15 2019 2:37 PM

Swami Vairagyanand Seeks Go-Ahead For Immolation - Sakshi

సజీవ సమాధి అయ్యేందుకు అనుమతించాలని మధ్యప్రదేశ్‌కు చెందిన స్వామి వైరాగ్యానంద ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

భోపాల్‌: సజీవ సమాధి అయ్యేందుకు అనుమతించాలని మధ్యప్రదేశ్‌కు చెందిన స్వామి వైరాగ్యానంద ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన దిగ్విజయ్‌ సింగ్‌ విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. డిగ్గీరాజా గెలవకుంటే సజీవ సమాధి అవుతానని ఆయన ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్‌ చేతిలో దిగ్విజయ్‌ 3.60 లక్షల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో వైరాగ్యానందను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆయన సజీవ సమాధికి అనుమతి కోరుతూ భోపాల్‌ కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు.

‘ప్రస్తుతం నేను కామాఖ్యధామంలో ఉంటున్నాను. మాట నిలబెట్టుకునేందుకు జూన్‌ 16న మధ్యాహ్నం 2.11 గంటలకు సజీవ సమాధిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. స్థానిక యంత్రాగం నాకు సహకరిస్తుందని నమ్ముతున్నాను’ అని దరఖాస్తులో వైరాగ్యానంద పేర్కొన్నారు. దీనికి అనుమతి ఇవ్వొద్దని తాను భోపాల్‌ డీఐజీకి లేఖ రాసినట్టు కలెక్టర్‌ తరుణ్‌కుమార్‌ పిథోడ్‌ తెలిపారు. వైరాగ్యానందను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. కంప్యూటర్‌ బాబాగా గుర్తింపుపొందిన నామ్‌దేవ్‌ దాస్‌ త్యాగి కూడా ఎన్నికల సమయంలో దిగ్విజయ్‌ సింగ్‌కు మద్దతుగా యజ్ఞయగాదులు, రోడ్‌షోలు నిర్వహించారు. దిగ్విజయ్‌ స్వయంగా వీటిల్లో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement