మథుర ఘటనలో ఎస్పీ సహా 24 మంది మృతి | SP among 24 killed in Mathura clash | Sakshi
Sakshi News home page

మథుర ఘటనలో ఎస్పీ సహా 24 మంది మృతి

Jun 3 2016 9:35 PM | Updated on Sep 4 2017 1:35 AM

పోలీసులకు, ఆక్రమణదారులకు మధ్య మథురలో జరిగిన యుద్ధకాండలో ఇప్పటివరకు 24 మంది చనిపోయారు.

ఉత్తరప్రదేశ్ః పోలీసులకు, ఆక్రమణదారులకు మధ్య మథురలో జరిగిన యుద్ధకాండలో ఇప్పటివరకు 24 మంది చనిపోయారు. పార్క్ ఆక్రమణ విషయంలో మొదలైన ఘర్షణతో చనిపోయిన వారిలో మథుర ఎస్పీ ద్వివే సహా, ఎస్ హెచ్ ఓ సంతోష్ యాదవ్ కూడ ఉన్నారు. గురువారం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విచారణకు ఆదేశించిన అనంతరం వివాదం రాజుకుంది.  

మథుర ఘర్షణలో మొత్తం 22 మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోగా వారిలో 11 మంది ఆందోళనల్లో భాగంగా వారు సృష్టించిన అగ్నికే ఆహుతైనట్లు ఉత్తర ప్రదేశ్ డీజీపీ జావేద్ అహ్మద్ తెలిపారు. ఘటనలో మొత్తం 124 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో ముఖ్యంగా ఘటనలో ప్రధాన నిందితుడైన రామ్ వృక్ష్ యాదవ్ ను నేషనల్ సెక్యూరిటీ చట్టం కింద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే స్థానికంగా తయారు చేసిన 47 కట్టా తుపాకీలను, ఆరు రైఫిల్స్ ను, 178 లైవ్ కాట్రిడ్జ్ లను సంఘటనా స్థలంనుంచీ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఘటనపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని, వైఫల్యానికి బాధ్యతగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. పటిష్టమైన భద్రతా చర్యలకు సన్నాహాలు చేసుకోకుండానే పోలీసులు పార్క్ ఖాళీ చేయించడానికి వెళ్ళారని,  పోలీసు నిర్వహణలో ముఖ్యమంత్రి వైఫల్యం చెందారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల తరపున ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వైఫల్యాన్ని అంగీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement