అమిత్ షాకు ఊరట | Sohrabuddin case: Amit Shah gets relief from SC | Sakshi
Sakshi News home page

అమిత్ షాకు ఊరట

Aug 1 2016 2:02 PM | Updated on Oct 22 2018 8:17 PM

సొహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

న్యూఢిల్లీ: సొహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ కేసు నుంచి అమిత్ షాకు విముక్తి కల్పిస్తూ బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త, ప్రభుత్వ మాజీ  అధికారి హర్ష్ మాందర్ వేసిన పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ ఎస్ఏ బొబ్డే, జస్టిస్ అశోక్ చౌహాన్ లతో కూడిన బెంచ్ తిరస్కరించింది. సొంత ప్రయోజనాల కోసమే మాందర్ పిటిషన్ దాఖలు చేసినట్టు కనబడుతోందని బెంచ్ అభిప్రాయపడింది.

2005లో జరిగిన గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్ షేక్‌తో పాటు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న తులసీరామ్ ప్రజాపతి హత్య కేసులో అప్పటి గుజరాత్ హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాను సీబీఐ నిందితుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను నిందితుడిగా గుర్తించడానికి ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. సొహ్రాబుద్దీన్ కుటుంబ సభ్యులు బాంబే హైకోర్టుకు వెళ్లగా సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement