ప్రచారం కొత్తపుంతలు
జోడెద్దుల పేరుతో సోషల్ మీడియాలో సందడి
సాక్షి, బెంగళూరు: ప్రతిసారి ఎన్నికల్లో మాదిరిగానే ఈ దఫా కూడా సార్వత్రిక ప్రచారం ఎన్నో ప్రత్యేకతలను మేళవించుకుంది. మండ్యలో స్వతంత్ర అభ్యర్థి సుమలత తరఫున సినీనటులు దర్శన్, యశ్ ప్రచారం చేశారు. వారిని సీఎం కుమారస్వామి జోడెద్దులు, దొంగ ఎద్దులు అని విమర్శించడంతో ప్రచారం వేడెక్కింది. సోషల్ మీడియాలో ఇరుపక్షాల నేతలు ‘జోడు ఎద్దులు’ ప్రచారం బాగా సాగింది. ఈ క్రమంలో ‘దొంగ ఎద్దులు.. కుంటి ఎద్దులు.. తెల్ల ఎద్దులు.. ఒంటి ఎద్దులు.. ’ పదాలకు భారీ డిమాండ్ పెరిగింది. మైసూరు నుంచి కలబుర్గిని తాకింది.
ఇంకా ఉన్నారు
కాంగ్రెస్ – జేడీఎస్ అభ్యర్థుల తరఫున సీఎం కుమారస్వామి, మంత్రి డీకే శివకుమార్ ప్రచారం చేసి జోడెద్దులుగా పేరుగాంచారు. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం సిద్ధరామయ్యను ఒక జతగా నిర్ణయించారు. విజయపుర పార్లమెంటు స్థానంలో జేడీఎస్ అభ్యర్థి ప్రచారంలో భాగంగా మంత్రులు ఎంబీ పాటిల్, శివానంద పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ‘జోడెద్దులు’ వేదికపైకి రావాలని పిలిచారు. అలాగే ఉత్తర కర్ణాటకలో హుబ్బళి – ధారవాడలో మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, ఎంపీ ప్రహ్లాద్ జోషిని జోడెద్దులుగా అభివర్ణించారు. బెళగావిలో రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ కోరె, ఎమ్మెల్సీ మహంతేశ్ను జోడెద్దులు అని పిలిచారు.
గతంలోనూ..
గత ఎన్నికల్లో ఇలాంటి ప్రచారం సాగింది. బీజేపీ నేతలు బీఎస్ యడ్యూరప్ప, అనంతకుమార్లను వారి అభిమానులు రామ లక్ష్మణులుగా అభివర్ణించారు. యడ్యూరప్ప, కేఎస్ ఈశ్వరప్పను అన్నదమ్ములుగా పిలిచారు. ధారవాడలో మల్లికార్జున ఖర్గే, ధరంసింగ్లను సెట్ దోశెలుగా కామెంట్ చేసేవారు. ఏ కార్యక్రమమైనా వారిద్దరూ దర్శనమివ్వడం కారణం. దక్షిణ కన్నడలో వీరప్ప మొయిలీ, జనార్దన పూజారి కోటి చెన్నయ్య అనేవారు. రామకృష్ణహెగడే, దేవెగౌడను జోడెద్దులు అని పిలిచేవారు.