బీజేపీలోకి చేరుతున్నారన్న వార్తలను సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కొట్టిపారేశారు. తనకు అసలు అలాంటి ఆలోచన ఏ కోశానా లేదని అన్నారు.
మధుర: బీజేపీలోకి చేరుతున్నారన్న వార్తలను సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కొట్టిపారేశారు. తనకు అసలు అలాంటి ఆలోచన ఏ కోశానా లేదని అన్నారు. ‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్తో జరిగిన సమావేశం కేవలం మర్యాద పూర్వకంగా జరిగిందే తప్ప మరొకటి కాదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరో కోణంలో తీసుకోరాదు’ అని శివపాల్ యాదవ్ బృందావనంలోని కృష్ణ గోపాల్ పీఠ్లో చెప్పారు. సమాజ్ వాది పార్టీకి తాను అసలైన సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు.
తన సోదరుడు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఏది చెబితే అదే చేస్తానని తెలిపారు. సమాజ్వాది పార్టీలోనే ఉంటానని చెప్పిన ఆయన మరోసారి అఖిలేశ్ను విమర్శించారు. వాస్తవానికి తండ్రికే విశ్వాసంగా ఉండని ఓ కుమారుడు ఇతరులకు ఎలా ఉంటారని నమ్ముతారు అని వ్యాఖ్యానించారు. బుధవారం శివపాల్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్తో భేటీ అయిన విషయం తెలిసిందే.