మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రాం ఇబోబి సింగ్ ప్రైవేట్ ఇంట్లోకి వెల్లి గృహోపకరణ వస్తువులను దోచుకెళ్లారు.
ఇంపాల్: దొంగలు ఏకంగా ముఖ్యమంత్రి నివాసానికే కన్నం వేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రాం ఇబోబి సింగ్ ప్రైవేట్ ఇంట్లోకి వెల్లి గృహోపకరణ వస్తువులను దోచుకెళ్లారు. తౌబల్ జిల్లాలో ఉన్న సీఎం ఇంటికి ఆయన భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే లంధోనీ దేవి ఆదివారం వెళ్లినపుడు ఈ సంఘటన వెలుగు చూసింది.
తాళం వేసిన ఈ ఇంట్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఎవరూ నివసించడం లేదు. అయినా 30 మంది రిజర్వ్ బెటాలియన్ సిబ్బందిని ఇంటికి రక్షణగా నియమించారు. అయితే భద్రత సిబ్బంది ముఖ్యమంత్రి నివాసానికి పక్కనే ఉన్న ఆయన సోదరుడు ఒక్రాం ఇబోటొంబా ఇంటి వద్ద కాపలాగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భద్రత సిబ్బంది అందరినీ మార్చినట్టు చెప్పారు. దొంగతనం జరిగిన సమయం, దోపిడీకి గురైన వస్తువల విలువ కచ్చితంగా తెలియదని తెలిపారు. దొంగతన విషయం వెలుగుచూసిన వెంటనే డీజీపీ సహా సీనియర్ పోలీసు అధికారులు, ఫోరెన్సిక్, బాంబు నిర్వీర్య సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు.