మోదీపై తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు

Praveen Togadia Controversial Comments On PM Modi - Sakshi

రాముడి పేరు చెప్పి పీఠం ఎక్కి, ముస్లింల వకల్తాదారుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు

సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల ఓట్లతో గెలిచి, ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రస్తుతం ముస్లిం మహిళల తరపు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారంటూ విశ్వహిందూ పరిషత్‌ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. ట్రిపుల్‌ తలాక్‌ అనేది ముస్లిం వర్గం వ్యక్తిగత అంశమని.. ఆ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవాదం, హిందుత్వ నినాదాలతో అధికారంలోకి వచ్చిన మోదీ.. హిందూ దేశాన్ని, కశ్మీర్‌లో ఉన్న హిందువులను రక్షించాల్సిందిపోయి ముస్లింల వకాల్తాదారుగా వ్యవహరించడం బాగోలేదంటూ విమర్శించారు.

బీజేపీనా.. మినీ కాంగ్రెస్‌ పార్టీయా
మథురలో జరగిన ఓ సమావేశానికి హాజరైన తొగాడియా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్న వారంతా బీజేపీని మినీ కాంగ్రెస్‌ పార్టీగా మారుస్తున్నారని ఆరోపించారు. అందుకే బీజీపీ హిందువుల సంక్షేమం గురించి పట్టించుకోవడం మానేసి ముస్లింల జపం చేస్తుందంటూ విమర్శించారు. మోదీ ప్రభుత్వం గోరక్షకులను గూండాలుగా.. గూండాలను(మాజీ కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి) సోదరులుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు.

అధికారంలో ఉండి కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టకపోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని తొగాడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా సింహాసనం ఎక్కేందుకే మోదీ రాముడి పేరు వాడుకున్నారని.. అధికారంలోకి రాగానే అసలు విషయం పక్కనపెట్టేశాని ఘాటుగా విమర్శించారు.  దేశ వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగురుతున్నా హిందువులకు ఏమాత్రం న్యాయం జరగడం లేదని తొగాడియా ఆవేదన వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణం విషయంలో వీహెచ్‌పీ అధ్యక్షుడిగా తన శాయశక్తులా ప్రయత్నించిన లాభం లేకపోయిందని వాపోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top