గరీబ్‌ కల్యాణ్‌తో 5 వేల కోట్లే! | only 5,000 crore with Garib Kalyan! | Sakshi
Sakshi News home page

గరీబ్‌ కల్యాణ్‌తో 5 వేల కోట్లే!

Jun 2 2017 2:54 AM | Updated on Apr 3 2019 5:16 PM

గరీబ్‌ కల్యాణ్‌తో 5 వేల కోట్లే! - Sakshi

గరీబ్‌ కల్యాణ్‌తో 5 వేల కోట్లే!

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) కింద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన డిపాజిట్లు మాత్రమే వచ్చాయనీ, ఈ పథకానికి నామమాత్ర స్పందన మాత్రమే

ఈ పథకానికి స్పందన అంతంతే: అధియా
 
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) కింద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన డిపాజిట్లు మాత్రమే వచ్చాయనీ, ఈ పథకానికి నామమాత్ర స్పందన మాత్రమే లభించిందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా గురువారం చెప్పారు. నల్లధనం వెల్లడికి అక్రమార్కులకు అవకాశమిస్తూ ప్రభుత్వం గత డిసెంబరు 17న ఈ పథకాన్ని ప్రారంభించింది. లెక్కల్లోకి రాని ఆదాయం తమ వద్ద ఎంత ఉందో అవినీతిపరులు ఈ పథకం కింద ప్రకటించి, ఆ డబ్బును ప్రభుత్వం వద్ద జమ చేయాలి. అందులో 50 శాతాన్ని ప్రభుత్వం పన్ను, సర్‌చార్జీ, జరిమానా కింద వసూలు చేస్తుంది.

మరో 25 శాతం ధనాన్ని వడ్డీ ఏమీ లేకుండా ప్రభుత్వం వద్ద కచ్చితంగా నాలుగేళ్లపాటు జమ చేయాలి. ఈ పథకం కింద అక్రమాదాయ వెల్లడికి గడువు మార్చి 31తో ముగిసింది. అక్రమార్కులు ముందుగానే పలు ఇతర ఖాతాల్లో డబ్బు జమ చేసి ఉండటం, పన్ను, సర్‌చార్జి రేట్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని హస్ముఖ్‌ అధియా చెప్పారు. కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్‌ జైట్లీ మాత్రం హస్ముఖ్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. పీఎంజీకేవై కింద వచ్చిన మొత్తాన్ని మాత్రమే వేరుగా చూసి తక్కువగా ఉందనుకోకూడదన్నారు. అదే ఏడాది అంతకన్నా ముందే స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని తీసుకొచ్చామనీ, అలాగే ప్రజలు కూడా నల్లధనాన్ని బ్యాంకు ఖాతా ల్లో జమచేసి పన్ను చెల్లించారని జైట్లీ పేర్కొన్నారు. అందువల్లే పీఎంజీకేవై కింద వెల్లడించిన మొత్తం తక్కువగా ఉందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement