ఈ జర్నలిస్టు.. ఉగ్రవాద నిందితుడట!! | odiya newspaper shows rajdeep sardesai as terror suspect, later apologies | Sakshi
Sakshi News home page

ఈ జర్నలిస్టు.. ఉగ్రవాద నిందితుడట!!

Sep 24 2016 1:00 PM | Updated on Sep 4 2017 2:48 PM

ఈ జర్నలిస్టు.. ఉగ్రవాద నిందితుడట!!

ఈ జర్నలిస్టు.. ఉగ్రవాద నిందితుడట!!

రాజ్‌దీప్ సర్దేశాయ్ పేరు తెలియని భారతీయులు చాలా తక్కువ మంది.

రాజ్‌దీప్ సర్దేశాయ్ పేరు తెలియని భారతీయులు చాలా తక్కువ మంది. ఎన్నికలతో పాటు దేశంలో ప్రధాన రాజకీయ పరిణామాలు ఎప్పుడు చోటుచేసుకున్నా తనదైన శైలిలో జాతీయ మీడియా చానళ్లలో విశ్లేషణలు అందిస్తుంటారు. అలాంటి వ్యక్తి ఫొటోను ఒడిషాకు చెందిన ఒక వార్తాపత్రిక తన మొదటి పేజీలో ప్రచురించింది. ఆయన ఏదో పెద్ద పాత్రికేయుడని ఆ ఫొటో వేస్తే పర్వాలేదు.. ఉగ్రవాద కేసులో నిందితుడు ఈయనే అంటూ ఆ ఫొటోను ఫొటోషాప్‌లో కొద్దిగా మార్పుచేర్పులు చేసి ప్రచురించింది. దాంతో.. సర్దేశాయ్ తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. సంబద్ అనే ఒడియా పత్రిక తన ఫొటోను స్కెచ్ గా మార్చి ప్రచురించిందని, ట్విట్టర్‌లో ఎవరో ఏదో చెబితే దాన్ని పట్టుకుని ఇలా వేసేశారని ఆయన ట్వీట్ చేశారు.


ఫొటోషాప్ చేసిన ఫొటోలు, అబద్ధాలు, తప్పుడు రిపోర్టింగ్.. వీటితో ఇంకెంత కాలం ఈ భక్తుల సైన్యం ట్విట్టర్‌లో తనవెంట పడతారని ఆయన ప్రశ్నించారు. దాంతో సంబద్ పత్రిక ఎడిటర్ ట్విట్టర్ ద్వారా సర్దేశాయ్‌కి క్షమాపణలు తెలిపారు. అయినా ఆయన శాంతించలేదు. క్షమాపణలను అంగీకరిస్తాను గానీ, తప్పు చేసిన విషయాన్ని పత్రిక మొదటిపేజీలో తన ఫొటోతో మళ్లీ ప్రచురించాలని డిమాండ్ చేశారు. ఆయన చెప్పినట్లే మొదటిపేజీలో ఆయన ఫొటోతో సహా క్షమాపణ వార్తను బాక్సు కట్టి మరీ ప్రచురించారు. దాన్ని కూడా రాజ్‌దీప్ మళ్లీ ట్వీట్ చేసి చెప్పారు. గతంలో రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్విట్టర్ అకౌంటును కొంతమంది హ్యాక్ చేశారు. దాన్నుంచి అసభ్యకర సందేశాలు పంపారు. దాంతో కొన్నాళ్ల పాటు ఆయన తన ట్విట్టర్ ఖాతాను ఆపేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement