దర్యాప్తు నీరుగార్చేందుకే బొగ్గు ఫైళ్లు మాయం చేశారు: దాస్‌గుప్తా | Missing files: an act of sabotaging probe, alleged Gurudas Dasgupta | Sakshi
Sakshi News home page

దర్యాప్తు నీరుగార్చేందుకే బొగ్గు ఫైళ్లు మాయం చేశారు: దాస్‌గుప్తా

Aug 20 2013 2:25 AM | Updated on Sep 1 2017 9:55 PM

బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును నీరుగార్చడానికే బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన కీలక ఫైళ్లను మాయం చేశారని సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా ఆరోపించారు.

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును నీరుగార్చడానికే బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన కీలక ఫైళ్లను మాయం చేశారని సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా ఆరోపించారు. ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ వెంటనే ఈ అంశంపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధానికి దాస్‌గుప్తా లేఖ రాశారు. ‘‘బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న తరుణంలో కొన్ని కీలక ఫైళ్లు కనిపించకుండా పోవడం అనేది చిన్న విషయం కాదు.

 

ఈ కుంభకోణంలో అత్యున్నత స్థాయి వ్యక్తులు, ప్రధాని కార్యాలయ(పీఎంఓ) పాత్ర లేదని చెప్పేందుకు ఉద్దేశపూర్వకంగానే వాటిని మాయం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, కేసు నుంచి కాపాడుకునేందుకు చేసిన చర్యగా కనిపిస్తోంది’’ అని దాస్‌గుప్తా దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement