ఎదురుదాడికి దిగిన మావోయిస్టులు

Maoists burned 2 buses - Sakshi

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఘటన

చర్ల: ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతికార చర్యలకు దిగారు. తెలంగాణ హైదరాబాద్‌ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు, మరో ప్రైవేట్‌ సర్వీసును మావోయిస్టులు దగ్ధం చేశారు. హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగ్దల్‌పూర్‌కు ఆర్టీసీ బస్సు వెళుతుండగా.. సుకుమా జిల్లా దోర్నపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుర్తి గ్రామ సమీపంలో మావోయిస్టులు నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించేశారు.

ఆ తరువాత బస్సు డీజిల్‌ ట్యాంక్‌ను పగులగొట్టి, ఆయిల్‌ను బస్సులో చల్లి నిప్పంటించారు. ఇదే మార్గం గుండా వెళ్తున్న మరో ప్రైవేటు బస్సు, టిప్పరు, ఒక ట్రాక్టర్‌ను సైతం దగ్ధం చేశారు. ప్రయాణికులు చూస్తుండగానే ఒకరిని కాల్చి చంపారు. మృతుడు కానిస్టేబుల్‌గా భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ, ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్లు సమీపంలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపునకు చేరుకున్నట్లు సమాచారం. 

మరోవైపు మావోయిస్టులు ఎదురుదాడి నేపథ్యంలో ఇంటలిజెన్స్‌ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కు బయల్దేరారు. అలాగే ఖమ్మం, భూపాల్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ముందస్తు సమాచారం ఇచ్చి పర్యటించాలని పోలీసు శాఖ సూచించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top