షెల్టర్‌ హోం కేసు : మంజూ వర్మ లొంగుబాటు

Manju Verma Surrenders In Muzaffarpur Shelter Home Case - Sakshi

పట్నా : ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసులో సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్న బిహార్‌ మాజీ మంత్రి మంజు వర్మ మంగళవారం బెగుసరాయ్‌ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో సీబీఐ తనను  అరెస్ట్‌ చేయకుండా మంజు వర్మ రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నారు. కాగా సీబీఐ కన్నుగప్పి తిరుగుతున్న మంజువర్మను పరారీలో ఉన్నట్టు ప్రకటించిన బెగుసరాయ్‌ కోర్టు ఆమె ఆస్తులను అటాచ్‌ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు ఉత్తర్వుల మేరకు వర్మ ఆస్తులను అటాచ్‌ చేసే ప్రక్రియను బిహార్‌ పోలీసులు పూర్తిచేశారు. ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోంలో 30 మంది బాలికలపై లైంగిక దాడి జరిగిన కేసులో ప్రధాన నిందితుడైన బ్రజేష్‌ ఠాకూర్‌తో మంజు వర్మ భర్త చంద్రశేఖర్‌ వర్మకు సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆమె ఈ ఏడాది ఆగస్టులో మంత్రి పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. షెల్టర్‌ హోం కేసుకు సంబంధించి గతంలో మంజూ వర్మ నివాసంపై, ఆమె బంధువుల నివాసంలో సీబీఐ చేపట్టిన దాడుల్లో ఆయుధాలు లభ్యం కావడంతో మంజు వర్మపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top